● పట్టు తప్పి కిందపడి
యువకుడి మృతి
చిల్లకూరు: కదిలే రైలును ఎక్కే క్రమంలో పట్టు తప్పి కిందపడి ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. ఓడూరు గ్రామానికి చెందిన పారిచెర్ల చరణ్ (28) కొంతకాలంగా తన అమ్మమ్మ గ్రామమైన నాయుడుపేట సమీపంలోని మన్నెమాలలో నివాసం ఉంటున్నాడు. అక్కడి నుంచి పనుల నిమిత్తం రోజూ నెల్లూరుకు రైలులో వెళ్లి తిరిగి ఇంటికి చేరుకుంటుంటాడు. ఈ క్రమంలోనే శుక్రవారం పనులు ముగించుకుని మెమూ రైల్లో నాయుడుపేటకు బయలుదేరాడు. ఓడూరు రైల్వేస్టేషన్ వచ్చిన తర్వాత తాగునీటి కోసం ప్లాట్ఫారంపైకి దిగాడు. తిరిగి రైలు బయలుదేరే సమయంలో వచ్చి ఎక్కే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో పట్టు తప్పి కిందపడటంతో అతను మృతిచెందాడు. ప్రయాణికులు గుర్తించి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. అలాగే రైల్వేస్టేషన్ మాస్టర్ గూడూరు రైల్వే పోలీసులకు విషయం తెలియజేయడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గూడూరు ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేశారు.


