రైతుల పక్షాన పోరాటం చేస్తాం | - | Sakshi
Sakshi News home page

రైతుల పక్షాన పోరాటం చేస్తాం

Mar 23 2026 9:09 AM | Updated on Mar 23 2026 9:09 AM

పొదలకూరు: జిల్లాలో ధాన్యం ధరలు రోజురోజుకూ దిగజారుతున్నాయని, మద్దతు ధరను ప్రభుత్వం అందజేసేంత వరకు రైతుల పక్షాన పోరాటం చేస్తామని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు మండలం మహ్మదాపురంలో ఆదివారం ఆయన పర్యటించారు. పార్టీ నేత కండ్లకూటి రమణారెడ్డి సతీమణి లక్ష్మీదేవమ్మ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తనను కలిసిన రైతులతో ముచ్చటించి, ధాన్యం ధరలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. వరి కోతలు పెరిగే కొద్దీ ధరలు మరింత పతనమయ్యే అవకాశం ఉందని చెప్పా రు. ప్రస్తుతం రూ.నాలుగు వేలను తగ్గించారని, కోతలు పెరిగి ధాన్యం దిగుబడి పూర్తిస్థాయిలో పెరిగితే ఈ మాత్రం కూడా లభించదని తెలిపారు. కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదును జమచేస్తామని సర్కార్‌ ప్రకటించిందని, అయితే అక్కడ కొనడంలేదని వివరించారు. ఇప్పటికే పుట్టి ఒక్కింటికి రూ.నాలుగు వేల మేర తగ్గాయని తెలిపారు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామంటూ జిల్లా అధికారులు ఆర్భాటంగా ప్రకటించారని, అయితే అక్కడ సేకరించడంలేదని విమర్శించారు. ధాన్యాన్ని కొనుగోలు చేయొద్దంటూ మౌఖిక ఆదేశాలను ప్రభు త్వం ఇస్తోందనే గుసగుసలు అధికారుల్లో వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. యూరియా అందక.. పెట్టుబడులు భారీగా పెరిగి ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యానికి మద్దతు ధర ఇవ్వకపోతే, ప్రజాప్రతినిధులు ఏమి చేస్తున్నారో అర్థం కావడంలేదని చెప్పారు. పొలాలకు సాగునీటిని సక్రమంగా అందజేయకుండా, ఇరిగేషన్‌ పనుల్లో దొంగ బిల్లులు చేసుకొని రూ.కోట్లను కొల్లగొట్టారని ధ్వజమెత్తారు. ధాన్యానికి మద్దతు ధర లభిస్తోందంటూ టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో పుట్టికి రూ.24 వేలను అందజేసిన విషయాన్ని గుర్తుచేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, సర్వేపల్లి బూత్‌ కమిటీల కన్వీ నర్‌ బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, పార్టీ మండల కన్వీనర్‌ పెదమల్లు రమణారెడ్డి, మాజీ ఎంపీపీ కోనం చినబ్రహ్మయ్య, నేతలు కరిపరెడ్డి కృష్ణారెడ్డి, అశోక్‌కుమార్‌రెడ్డి, తిరుపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రోజురోజుకూ దిగజారుతున్న ధాన్యం ధరలు

వరి కోతలు పెరిగితే మరింత పతనమయ్యే అవకాశం

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement