నెల్లూరు(క్రైమ్): నగరంలోని డీకేడబ్ల్యూ కళాశాల వెనుక స్వర్ణాల చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం తేలియాడుతుండడాన్ని శనివారం స్థానికులు గుర్తించి దర్గామిట్ట పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహం ఉబ్బి దుర్గంధం వెదజల్లుతూ ఉంది. మృతుడు సుమారు 35 నుంచి 40 ఏళ్ల వయస్సు కలిగి ఉన్నాడు. 35వ వార్డు ఇన్చార్జి వీఆర్వో మధుసూదన్రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. స్వర్ణాల చెరువుతో పాటు నీలగిరి సంఘం పరిసర ప్రాంతాల్లో మృతుని ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. మృతుని వివరాలు తెలిసిన వారు దర్గామిట్ట పోలీసులకు తెలియజేయాలని స్థానిక ఇన్స్పెక్టర్ బి.కల్యాణరాజు కోరారు.
కనుల పండువగా
శ్రీవారి కల్యాణం
రాపూరు: మండలంలోని పెంచలకోన క్షేత్రంలో శనివారం పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవిల కల్యాణాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 4 గంటలకు మూలమూర్తికి అభిషేకం, 5 గంటలకు సుప్రభాతం, 6 గంటలకు గోపూజ, పూలంగిసేవ జరిపారు. 10 గంటలకు స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను నిత్యకల్యాణ మండపంలో కొలువుదీర్చి వివిధ రకాల ఆభరణాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి వేదపండితుల మంత్రోచ్ఛారణలతో కల్యాణాన్ని గావించారు. సాయంత్రం 6 గంటలకు ఊంజల్సేవ నిర్వహించారు.
గ్రామాల్లో భయం భయం..
కలువాయి(సైదాపురం): రగామాల్లో చెత్త సేకరించుకుంటున్న నేపంతో కొందరు మహిళలు ముఠాగా ఏర్పడి చిన్న పిల్లలను టార్గెట్ చేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. నాలుగు రోజుల కిందట కలువాయి మండలం పెన్నా బద్వేలు గ్రామంలో చెత్త ఏరుకుంటూ సంచరిస్తున్న నలుగురు మహిళలు పెన్నా బద్వేల్ పాత ఊరు ఎస్సీ కాలనీలో తుమ్మల రమేష్ కుమార్తెకు చాక్లెట్లు ఇస్తూ చూట్టూముట్టడంతో చిన్నారి కేకలు వేసింది. దీంతో కాలనీ వాసులు ఒక్కొక్కరిగా అక్కడకు చేరుకుని నలుగురు మహిళలను అడ్డగించగా దగ్గరలో ఉన్న ఆటో ఎక్కి పరారయ్యారని కాలనీ వాసులు తెలిపారు. ఈ విషయం పట్ల గ్రామంలో ఆందోళన నెలకొంది.
కండలేరులో
48.220 టీఎంసీల నీరు
రాపూరు: కండలేరు జలాశయంలో శనివారం నాటికి 48.220 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2100, లోలెవల్ కాలువకు 200, హైలెవల్ కాలువకు 200, పిన్నేరు కాలువకు 50, మొదటి బ్రాంచ్ కాలువకు 80 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వివరించారు.
పొదలకూరు నిమ్మధరలు(కిలో)
పెద్దవి: రూ.90
సన్నవి: రూ.70
పండ్లు: రూ.45


