
అక్రమ మైనింగ్పై చర్యలకు డిమాండ్
● ఫిర్యాదుదారుపై డీడీ రుసరుసలు
నెల్లూరు (టౌన్): సైదాపురం మండలంలోని క్వార్ట్జ్ గనుల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్పై చర్యలు చేపట్టాలని రాష్ట్ర సంగీత అకాడమీ మాజీ చైర్పర్సన్ పొట్టేళ్ల శిరీషా డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆటోనగర్లోని మైనింగ్ కార్యాలయంలో డీడీ బాలాజీనాయక్కు వినతిపత్రాన్ని శనివారం అందజేసిన అనంతరం ఆమె మాట్లాడారు. లీజు ముగిసినా పలు క్వార్ట్జ్ గనుల్లో అక్రమ మైనింగ్ చేస్తున్నారని ఆరోపించారు. నిల్వ ఉన్న వాటిని తరలించేందుకు అనుమతిస్తే, అక్రమంగా తవ్వుతున్నారని చెప్పారు. సిద్ధి వినాయక మైన్స్లో జిలెటిన్ను ఉపయోగించి ప్రమాదకరంగా బ్లాస్టింగ్ చేస్తున్నారని పేర్కొన్నారు. భారీగా ముడుపులు తీసుకుంటూ అక్రమ మైనింగ్, బ్లాస్టింగ్తో తమకేమీ సంబంధం ఉందంటూ సదరు అధికారి ప్రశ్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శోభారాణి మైనింగ్పై రూ.32 కోట్ల డిమాండ్ నోటీస్ ఉందన్నారు. ఏడీగా బాలాజీనాయక్ ఉన్న సమయంలో 32 వేల టన్నుల స్టాక్ను చూపించారని, ఆయన డీడీగా వచ్చినప్పుడు 1.25 లక్షల టన్నుల మెటీరియల్ నిల్వ ఉందని చెప్తుండటంపై అనుమానం వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్ వ్యవహారంపై కలెక్టర్కు ఫిర్యాదు చేశామని వివరించారు.
దబాయింపు ధోరణి
పొట్టేళ్ల శిరీషాపై డీడీ బాలాజీనాయక్ రుసరుసలాడారు. అక్రమ మైనింగ్, బ్లాస్టింగ్పై తమకే సంబంధం లేదంటూ దబాయించారు. మీడియా ముందు తన పేరును ఎందుకు ప్రస్తావించారంటూ రుసురుసలాడారు. ఫిర్యాదు చేశారు కాబట్టి విచారణ చేపడతామని, వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలన్నారు.