
కళ్లెదుటే.. కర్కశంగా..
కశ్మీర్ నరమేథం కావలిలో విషాదాన్ని మిగిల్చింది. ముష్కర ఉన్మాదంలో కావలి వాసి సోమిశెట్టి మధుసూదన్ బలయ్యాడు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన మధుసూదన్ కష్టపడి బీటెక్ పూర్తి చేసి బెంగళూరులో ఐబీఎం సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. తండ్రి అరటి కాయల హోల్సేల్ వ్యాపారి. తల్లి గృహిణి. తల్లిదండ్రులకు ఇద్దరు కుమార్తెలతోపాటు మధుసూదన్ ఒక్కడే వారసుడు. భార్యాబిడ్డల కళ్ల ముందే అతన్ని అతి సమీపం నుంచి కాల్చి చంపారు. కశ్మీర్ ఘటనలో కావలి వాసి మృతి చెందాడనే విషయం ఆలస్యంగా తెలియడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలికిపడ్డారు.
కావలి: కశ్మీర్ అందాలను ఆస్వాదించాలని భార్యాపిల్లలతో కలిసి వెళ్లిన కావలికి చెందిన ఓ టెకీ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఉగ్ర ముష్కరులు కావలి పట్టణానికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ (46)ను భార్యా పిల్లల కళ్లెదుటే కాల్చి చంపారు. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన అనంత్నాగ్ జిల్లా పహల్గాం సమీపంలోని బైసారన్ లోయలోని పచ్చని మైదానంలో మధుసూదన్ భార్య, తన ఇద్దరు పిల్లలతో కలిసి మంగళవారం మధ్యాహ్నం విహరిస్తుండగా ఈ దారుణంగా జరిగింది.
మధ్య తరగతి నుంచి సాఫ్ట్వేర్గా..
సోమిశెట్టి మధుసూదన్ మధ్య తరగతి కుటుంబం నుంచి ప్రతిష్టాత్మకమైన ఐబీఎంలో సాఫ్ట్వేర్గా విధులు నిర్వర్తించే స్థాయికి చేరాడు. కావలి పట్టణంలోని ఆనాలవీధికి చెందిన సోమిశెట్టి తిరుపాలు, పద్మావతి దంపతులకు కుమారుడు మధుసూదన్తోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తండ్రి తిరుపాల్ స్థానికంగా మేదరబజార్లో అరటికాయలు హోల్సేల్ వ్యాపారం చేస్తుంటారు. మధుసూదన్ పట్టణంలోని విశ్వోదయ బాలుర ఉన్నత పాఠశాలలో 10వ తరగతి, జవహర్ భారతిలో ఇంటర్మీడియట్ వరకు చదివారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఇంజినీరింగ్ (బీటెక్)ను పూర్తి చేశారు. నెల్లూరుకు చెందిన కామాక్షితో వివాహం అనంతరం బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చేరారు. మధుసూదన్ ఐబీఎంలో పని చేస్తుండగా, భార్య కామాక్షి టీసీఎస్లో సాఫ్ట్వేర్గా విధులు నిర్వర్తిస్తోంది. 15 ఏళ్లుగా బెంగళూరులో స్థిరపడిన మధుసూదన్ దంపతులకు ఇంటర్మీడియట్ చదివే కుమార్తె మేధు, ఎనిమిదో తరగతి చదువుతున్న దత్తు అనే కుమారుడు ఉన్నారు. తన ఇద్దరు చెల్లెళ్లు కూడా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా స్థిరపడేలా చేసిన మధుసూదన్ ప్రకాశం జిల్లా సింగరాయకొండ, దగదర్తి మండలం చెన్నూరుకు చెందిన వారితో వివాహాలు చేశాడు.
కశ్మీర్ అందాలను చూడాలని..
మధుసూదన్ భార్య, పిల్లలతో కలిసి పర్యాటక ప్రాంతం పహల్గాంకు వెళ్లారు. ప్రకృతి కనువిందు చేసే బైసారన్ లోయ ప్రాంతంలో పర్యటిస్తున్న సమయంలో ఉగ్రవాదులు భార్య, పిల్లల కళ్లెదుటే మధుసూదన్ను కర్కశంగా తుపాకీతో కాల్చుతుంటే దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు. ఈ హఠాత్ పరిణామంతో వారు హతాశులయ్యారు. భార్య, పిల్లలను మాత్రం ఉగ్రవాదులు విడిచి పెట్టారు. మధుసూదన్ ఉగ్ర ముష్కరులు జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పో యారని తెలిసి స్థానికంగా వారి కుటుంబంతో సన్నిహితంగా ఉండేవారు నివ్వెరపోయారు. ఈ విషయం బుధవారం వెలుగులోకి రావడంతో కావలిలో విషాదం నెలకొంది. మధుసూదన్ తల్లిదండ్రులకు హృద్రోగ సంబంధిత సమస్యలు (గుండె జబ్బులు) ఉండడంతో బంధువులు ఈ విషయాన్ని తెలియకుండా కుటుంబ సభ్యులు, బంధువులు జాగ్రత్త పడ్డారు.
అమ్మా నాన్నలకు ఏమని చెప్పను
మా అన్న మా కుటుంబాన్ని చక్కగా చూసుకొనే వాడు. కశ్మీరును చూడాలని చాలా కాలం నుంచి చెబుతుండేవాడు. బెంగళూరులోని స్నేహితులతో కలిసి కశ్మీర్ యాత్రకు వెళ్లారు. అందరితో చాలా కలివిడిగా ఉంటాడు. మా అమ్మ, నాన్నలు హార్ట్ పేషెంట్లు. వాళ్లకు మా అన్న చనిపోయాడని ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు.
– విజయలక్ష్మి, మధుసూదన్ చెల్లెలు
భార్య, పిల్లలతో మధుసూదన్ (ఫైల్)
భార్యాపిల్లలతో కలిసి పహల్గాం
వెళ్లిన వైనం
దంపతులిద్దరూ ఐటీ ఉద్యోగులు
భార్య, పిల్లల కళ్ల ముందే దారుణహతం
కావలికి భౌతికకాయం
మధుసూదన్ భౌతికకాయం శ్రీనగర్ నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి చైన్నెకు విమానం ద్వారా పంపే ఏర్పాట్లు కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. చైన్నె విమానాశ్రయం నుంచి మధుసూదన్ స్వస్థలం కావలి పట్టణానికి చేర్చే ఏర్పాట్లు చేశారు. చైన్నె విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో గురువారం తెల్లవారుజాముకు చేరుకునే అవకాశం ఉంది.