అప్పుడలా.. ఇప్పుడు పశ్చాత్తాపం ఎందుకు?: సెహ్వాగ్‌ ఫైర్‌ | What is use of regretting now After heard RR qualified: Sehwag Slams KKR | Sakshi
Sakshi News home page

అప్పుడేమో అలా.. ఇప్పుడు పశ్చాత్తాపం ఎందుకు?: సెహ్వాగ్‌ ఫైర్‌

May 25 2026 10:29 AM | Updated on May 25 2026 10:50 AM

What is use of regretting now After heard RR qualified: Sehwag Slams KKR

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) ఆట తీరును భారత మాజీ ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ విమర్శించాడు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ఏం లాభమంటూ మండిపడ్డాడు. ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో కనీస పోరాట పటిమ కనబరచలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

వరుస వైఫల్యాలు
గతంలో మూడుసార్లు చాంపియన్‌గా నిలిచి కేకేఆర్‌.. గత రెండేళ్లుగా పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. గతేడాది డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగి.. పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ కేవలం ఐదే గెలిచి ఎనిమిదో స్థానంతో ముగించింది.

ఇక ఐపీఎల్‌-2026 సీజన్‌ ఆరంభ దశలో వరుస పరాజయాలతో డీలా పడ్డ కేకేఆర్‌.. తర్వాత ఊహించని రీతిలో పుంజుకుంది. తద్వారా ప్లే ఆఫ్స్‌ రేసులోనూ నిలిచింది. అయితే, కేకేఆర్‌ కంటే మెరుగైన స్థితిలో ఉన్న రాజస్తాన్‌ రాయల్స్‌.. ఆదివారం నాటి మధ్యాహ్నం మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది.

టాప్‌-4లో రాజస్తాన్‌
ఫలితంగా ప్లే ఆఫ్స్‌లో మిగిలిన ఒక్క బెర్తును ఖరారు చేసుని.. ఆర్సీబీ, గుజరాత్‌, సన్‌రైజర్స్‌లతో పాటు టాప్‌-4లో నిలిచింది రాజస్తాన్‌. దీంతో కేకేఆర్‌, పంజాబ్‌, ఢిల్లీ ఇంటిబాట పట్టాయి. అయితే, లీగ్‌ దశలో ఆఖరి మ్యాచ్‌లో భాగంగా కేకేఆర్‌- ఢిల్లీ ఆదివారం రాత్రి తలపడ్డాయి.

 ఒక్క పరుగు తేడాతో గెలిచినా
ఈ నామమాత్ర పోరులో ఢిల్లీ 40 పరుగుల తేడాతో కేకేఆర్‌పై విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సెహ్వాగ్‌ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడు పశ్చాత్తాపడి ఏం ప్రయోజనం? లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో గెలిచినా బాగుండేది. అలా అయితే ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించే అవకాశం ఉండేది.

ఆరోజు లక్నోపై గెలవలేదు. ఇక ఢిల్లీతో మ్యాచ్‌లోనూ పేలవ ప్రదర్శన. బహుశా.. రాజస్తాన్‌ ప్లే ఆఫ్స్‌ చేరిందని తెలిసిన తర్వాత కేకేఆర్‌ శిబిరం నిరాశలో మునిగిపోయి ఉంటుంది. వాళ్లు అనాసక్తంగా బ్యాటింగ్‌ చేసినట్లు అనిపించింది. వికెట్లు పడుతూనే ఉన్నాయి.

చెత్త షాట్‌ సెలక్షన్‌
మీరు ఎలాగో ప్లే ఆఫ్స్‌ చేరలేకపోయారు. కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా మంచిగా ఆడొచ్చు కదా!’’ అని విమర్శించాడు. అదే విధంగా.. ‘‘కోల్‌కతా పిచ్‌పై ఢిల్లీ విధించిన 204 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం పెద్ద కష్టమేమీ కాదు. ఢిల్లీ బౌలర్లు కూడా పెద్దగా రాణించలేదు. 

కేకేఆర్‌ ఆటగాళ్లే చెత్త షాట్‌ సెలక్షన్‌తో వికెట్లు పారేసుకున్నారు’’ అని బ్యాటర్ల తీరుపై సెహ్వాగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా ఈ సీజన్‌లో కేకేఆర్‌ పద్నాలుగు మ్యాచ్‌లకు ఆరు గెలిచి.. ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక ఏకనా స్టేడియంలో లక్నోతో మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్లో ఓడిపోయిన కేకేఆర్‌ రెండు పాయింట్లు చేజార్చుకున్న సంగతి తెలిసిందే.

చదవండి: ‘అతడి వల్లే విజయం.. లేకుంటే ఇంటికి పోయేవాళ్లం!’

Advertisement
 
Advertisement
Advertisement