Photo Credit: BCCI/X
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడు. అంతేకాదు.. అత్యధిక పరుగుల వీరుడిగానూ సచిన్ కొనసాగుతున్నాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 34,357 పరుగులు సాధించాడు.
ఇక టెస్టుల్లో రికార్డు స్థాయిలో 51 శతకాల సాయంతో ఏకంగా 15,921 పరుగులు సాధించాడు సచిన్. మరోవైపు.. విరాట్ కోహ్లి సైతం ప్రపంచ క్రికెట్పై తనదైన ముద్ర వేశాడు. వన్డేల్లో 54సార్లు శతక్కొట్టి.. సచిన్ వన్డే సెంచరీ (49)ల రికార్డును అధిగమించి చరిత్ర సృష్టించాడు.
పోలిక అవసరమే లేదు!
కాగా సచిన్- కోహ్లి మధ్య పోలిక గురించి ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు పంచుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు ఎవరికి వారే ప్రత్యేకమని.. ఇద్దరినీ పోల్చి చూడటం సరికాదనేదే చాలా మంది అభిప్రాయం. అయితే, సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ తాజాగా సచిన్- కోహ్లి గురించి చేసిన వ్యాఖ్యలు మరోసారి ఈ చర్చకు దారితీశాయి.
ఉపఖండ బ్యాటర్లకు విదేశాల్లో టెస్టు క్రికెట్ ఎలా ఆడాలో సచిన్ చూపించాడన్న ఏబీడీ.. కోహ్లి మాత్రం సచిన్నే అధిగమించిపోయాడని అన్నాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ..
సచిన్ కంటే కోహ్లినే బెటర్
‘‘బౌన్సీ, సీమింగ్ పిచ్లపై ఎలా ఆడాలో ఉపఖండ బ్యాటర్లకు సచిన్ టెండుల్కర్ దిశానిర్దేశం చేశాడు. అయితే, విరాట్ ఆ వారసత్వాన్ని మరింత గొప్పగా ముందుకు తీసుకువెళ్లాడు. నిజానికి ఈ ట్రెండ్ను మొదలుపెట్టింది సచిన్ అయినా.. ఆయన విరాట్ కోహ్లి అంత స్ట్రాంగ్ అయితే కాదు.
సచిన్ కంటే కోహ్లి బెటర్. కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్ వంటి బ్యాటర్లు విరాట్, సచిన్ అడుగుజాడల్లో నడుస్తున్నారు. అయితే, విదేశాల్లో రాహుల్ బ్యాటింగ్ సగటు 34 మాత్రమే. కాబట్టి అతడు మరింత మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది’’ అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.
విదేశాలు, SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో సచిన్, కోహ్లి గణాంకాలు ఇలా
సచిన్ విదేశాల్లో టెస్టుల్లో సచిన్ టెండుల్కర్ మొత్తంగా 8705 పరుగులు రాబట్టాడు. ఇక కోహ్లి 4774 పరుగులు చేశాడు. అదే విధంగా SENA దేశాల్లో సచిన్ టెండుల్కర్ 63 టెస్టులు ఆడి సగటు 5387 పరుగులు సాధించాడు. ఇందులో 17 శతకాలు, 23 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఇక కోహ్లి SENA దేశాల్లో 46 టెస్టు మ్యాచ్లు ఆడి 3661 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 14 ఫిఫ్టీలు ఉన్నాయి. అయితే, కోహ్లి కెప్టెన్గా ఉన్న సమయంలో టీమిండియా టెస్టుల్లో అత్యుత్తమ దశకు చేరుకుంది. ముఖ్యంగా విదేశాల్లో మంచి విజయాలు నమోదు చేసింది.
చదవండి: టీ20 మ్యాచ్లో ఇంగ్లండ్పై 118 పరుగుల తేడాతో భారత్ గెలుపు


