న్యూఢిల్లీ: భారత టెన్నిస్ డబుల్స్ ప్లేయర్ శ్రీరామ్ బాలాజీ తన కెరీర్లో 18వ ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్ను సాధించాడు. పోర్చుగల్లో జరిగిన ఒయిరాస్ ఏటీపీ–125 చాలెంజర్ టోర్నీలో శ్రీరామ్ బాలాజీ (భారత్)–నీల్ ఒబెర్లేట్నర్ (ఆ్రస్టియా) ద్వయం విజేతగా నిలిచింది. బారియెంటోస్ (కొలంబియా)–బెహర్ (గ్రీస్) జోడీతో జరిగిన ఫైనల్లో బాలాజీ–ఒబెర్లేట్నర్ జంట 6–7 (7/9), 6–4, 11–9తో ‘సూపర్ టైబ్రేక్’లో గెలిచింది.
ఈ ఏడాది బాలాజీ–ఒబెర్లేట్నర్లకు నాలుగో డబుల్స్ టైటిల్ కావడం విశేషం. ఒక గంట 49 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో బాలాజీ, ఒబెర్లేట్నర్ ఏడు ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు సాధించింది. తొలి సర్వీస్లో 38 పాయింట్లు, రెండో సర్వీస్లో 19 పాయింట్లు సంపాదించింది. టైటిల్ గెలిచిన బాలాజీ–ఒబెర్లేట్నర్లకు 9,010 యూరోల (రూ. 9 లక్షల 81 వేలు) ప్రైజ్మనీతోపాటు 125 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.


