
గాలె: బ్యాటర్లు పరుగుల పండగ చేసుకున్న బంగ్లాదేశ్, శ్రీలంక తొలి టెస్టు చివరకు ‘డ్రా’గా ముగిసింది. శనివారం వర్షం కారణంగా మ్యాచ్కు అంతరాయం వాటిల్లడంతో... రసవత్తర ఫలితానికి అవకాశం లేకుండా పోయింది. ఓవర్నైట్ స్కోరు 177/3తో ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్... 87 ఓవర్లలో 285/6 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. కెప్టెన్ నజ్ముల్ హసన్ షంటో (199 బంతుల్లో 125 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్లు) ఈ మ్యాచ్లో రెండో సెంచరీని తన పేరిట రాసుకున్నాడు. ముష్ఫికర్ రహీమ్ (102 బంతుల్లో 49; 4 ఫోర్లు) రాణించాడు.
అయితే బంగ్లా కెప్టెన్ సెంచరీ పూర్తి చేసుకునే క్రమంలో... నిధానంగా ఆడటంతో మ్యాచ్ ఆసక్తికర మలుపు వైపు మొగ్గు చూపలేదు. శ్రీలంక బౌలర్లలో తిరిందు రత్ననాయకే 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 296 పరుగుల లక్ష్యఛేదన కోసం బరిలోకి దిగిన శ్రీలంక ఆట నిలిచిపోయే సమయానికి 32 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. తైజుల్ ఇస్లామ్ 3 వికెట్లు తీసి భయపెట్టినా... తగినంత సమయం లేకపోవడంతో శ్రీలంక ‘డ్రా’తో గట్టెక్కింది.
అంతకుముందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 495 పరుగులు చేయగా... శ్రీలంక 485 పరుగులు చేసింది. రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేసిన బంగ్లాదేశ్ సారథి నజ్ముల్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య బుధవారం నుంచి కొలంబో వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది.

మాథ్యూస్కు వీడ్కోలు..
ఈ మ్యాచ్తో శ్రీలంక ఆల్రౌండర్ ఏంజెలో మాథ్యూస్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. జాతీయ జట్టు తరఫున 119 టెస్టులు ఆడిన మాథ్యూస్ 44.40 సగటుతో 8214 పరుగులు చేశాడు. బంతితోనూ ఫర్వాలేదనిపించిన అతడు 33 వికెట్లు సైతం పడగొట్టాడు. 2014లో ఇంగ్లండ్ గడ్డపై ఏకైక టెస్టు సిరీస్ గెలిచిన శ్రీలంక జట్టుకు మాథ్యూస్ కెప్టెన్గానూ వ్యవహరించాడు.
చదవండి: IND vs ENG 1st Test: అప్పుడు స్టుపిడ్.. స్టుపిడ్! ఇప్పుడు సూపర్బ్.. సూపర్బ్