Swiss Open badminton: సెమీస్‌కు దూసుకెళ్లిన సింధు

PV Sindhu storm into Semi finals In Swiss Open badminton - Sakshi

బాసెల్‌: స్విస్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ క్రీడాకారిణి పీవీ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో రెండో సీడ్‌ సింధు 21–10, 21–19తో ఐదో సీడ్‌ మిచెల్లి లీ (కెనడా)పై విజయం సాధించింది. 36 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో సింధు పూర్తి ఆధిపత్యం చలాయించగా... రెండో గేమ్‌లో ఆమెకు గట్టిపోటీ లభించింది. కీలకదశలో సింధు పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో సుపనిద కటెథోంగ్‌ (థాయ్‌లాండ్‌)తో సింధు ఆడుతుంది. 

ప్రణయ్‌ ముందంజ... 
పురుషుల సింగిల్స్‌లో భారత అగ్రశ్రేణి ఆటగాడు హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. క్వార్టర్‌ ఫైనల్లో ప్రణయ్‌ 21–16, 21–16తో భారత్‌కే చెందిన పారుపల్లి కశ్యప్‌ను ఓడించాడు. మరో క్వార్టర్‌ ఫైనల్లో సమీర్‌ వర్మ 17–21, 14–21తో ఆంథోనీ సినిసుక జిన్‌టింగ్‌ (ఇండోనేసియా) చేతిలో పరాజయం పాలయ్యాడు. మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్‌) పోరాటం ముగిసింది. క్వార్టర్‌ ఫైనల్లో సిక్కి రెడ్డి–అశ్విని ద్వయం 20–22, 21–23తో వివియన్‌ హూ–లిమ్‌ చియు సియెన్‌ (మలేసియా) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది.

చదవండి: IPL 2022:క్రికెట్‌ పండగొచ్చింది.. కోల్‌కతా, చెన్నై సమరానికి సిద్దం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top