
నేడు పారిస్ డైమండ్ లీగ్ బరిలో నీరజ్ చోప్రా
పారిస్: భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా ఈ సీజన్లో అగ్ర స్థానం లక్ష్యంగా మరో టోర్నీలో బరిలోకి దిగనున్నాడు. ఈ ఏడాది 90 మీటర్ల మార్క్ను అందుకున్న ఈ మాజీ ఒలింపిక్, వరల్డ్ చాంపియన్ పారిస్ డైమండ్ లీగ్లో టాప్ ర్యాంక్పై కన్నేశాడు. జర్మన్ స్టార్ జులియన్ వెబెర్, రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గెనడా) తదితర హేమాహేమీలంతా ఈ మీట్లో ఉండటంతో జావెలిన్ త్రో పోటీ ఆద్యంతం రసవత్తరంగా జరగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పైగా 8 మంది బరిలోకి దిగుతున్న ఫైనల్ ఈవెంట్లో ఐదుగురు జావెలిన్ త్రోయర్లు 90 మీటర్ల మార్క్ను అధిగమించిన వారే ఉండటం పోటీని దీటుగా మార్చేసింది. భారత కాలమానం ప్రకారం నీరజ్ ఈవెంట్ రాత్రి 1 గంట 12 నిమిషాలకు మొదలవుతంది.
గత నెలలో జరిగిన దోహా డైమండ్ లీగ్ మీట్లో వెబెర్... నీరజ్ చోప్రాను అధిగమించాడు. వెబెర్ ఈటెను 91.06 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో ... చోప్రా 90.23 మీటర్లతో రెండో స్థానంలో నిలిచారు. అనంతరం జరిగిన పోలాండ్ మీట్లో ఇద్దరు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలేకపోయినా... మళ్లీ తొలి రెండు స్థానాల్లో నిలిచారు.