దేశవాళీ క్రికెట్లో టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. మరోసారి తన అద్భుత ప్రదర్శనతో జాతీయ సెలక్టర్లు సవాల్ విసిరాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో బెంగాల్కు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ.. గురువారం సర్వీసెస్తో జరిగిన మ్యాచ్లో దుమ్ములేపాడు.
తన సీమ్ బౌలింగ్తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో షమీ కేవలం 13 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అతడి సంచలన ప్రదర్శన ఫలితంగా సర్వీస్పై 7 వికెట్ల తేడాతో బెంగాల్ విజయం సాధించింది.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సర్వీసస్ 18.2 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మోహిత్ అహ్లావాట్(38) టాప్ స్కోరర్గా నిలవగా.. నకుల్ శర్మ(32), వినీత్(32) రాణించారు. బెంగాల్ బౌలర్లలో షమీతో పాటు ఆకాష్ దీప్ మూడు, ఆఫ్-స్పిన్నర్ వ్రిత్తిక్ ఛటర్జీ రెండు వికెట్లు సాధించాడు.
అభిషేక్, అభిమన్యు మెరుపులు
అనంతరం 166 పరుగుల లక్ష్యాన్ని బెంగాల్ కేవలం మూడు వికెట్లు కోల్పోయి 15.1 ఓవర్లలో చేధించింది. అభిషేక్ పోరెల్(56), అభిమన్యు ఈశ్వరన్(58) హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఈ టోర్నీలో బెంగాల్కు ఇది నాలుగో విజయం. ఈ గెలుపుతో బెంగాల్( 16) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
సెలక్టర్లపై విమర్శలు..
ఇక దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న షమీకి జాతీయ జట్టులోకి చోటు ఇవ్వాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. సూపర్ ఫామ్లో ఉన్న వరల్డ్ క్లాస్ బౌలర్ను ఎలా పక్కన పెడతారని సెలక్టర్లపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. భారత మాజీ క్రికెటర్ల సైతం షమీని ఎంపిక చేయకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు.
సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేల్లోనూ భారత బౌలింగ్లో అనుభవం లేమి కన్పించింది. దీంతో అనుభవజ్ఞుడైన షమీని ఎందుకు జట్టులోకి తీసుకు రావడం లేదని మాజీ హాఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మండిపడ్డాడు. షమీ చివరగా భారత్ తరపున ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆడాడు.
అప్పటి నుంచి ఫిట్నెస్ లోపం పేరిట అతడిని జట్టులోకి తీసుకోవడం లేదు. కానీ షమీ మాత్రం దేశవాళీ క్రికెట్లో క్రమం తప్పకుండా ఆడుతున్నాడు. తాజాగా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు ప్రకటించిన జట్టులోనూ షమీకి చోటు దక్కలేదు.
చదవండి: ENG vs AUS: 'నగ్నంగా నడుస్తానని సవాల్'... హేడెన్ పరువు కాపాడిన జో రూట్


