ఢిల్లీ క్యాపిటల్స్‌ కోచ్‌కు భారీ షాకిచ్చిన బీసీసీఐ! | IPL 2025 DC vs RR: Know Reason Behind Why DC Coach Munaf Patel Penalised By BCCI, Check More Details Inside | Sakshi
Sakshi News home page

DC Vs RR: ఢిల్లీ క్యాపిటల్స్‌ కోచ్‌కు భారీ షాకిచ్చిన బీసీసీఐ!.. జరిమానాతో పాటు..

Apr 17 2025 1:40 PM | Updated on Apr 17 2025 3:36 PM

IPL 2025 DC vs RR: DC Coach Munaf Patel Fined Penalised by BCCI Why

PC: BCCI

గెలుపు జోష్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals) జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ టీమ్‌ బౌలింగ్‌ కోచ్‌ మునాఫ్‌ పటేల్‌ (Munaf Patel)కు ఐపీఎల్‌ పాలక మండలి జరిమానా విధించింది. అంతేకాదు.. అతడి ఖాతాలో ఓ డీమెరిట్‌ పాయింట్‌ కూడా జతచేసింది. రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా మునాఫ్‌ పటేల్‌ అనుచిత ప్రవర్తనకు గానూ భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఈ మేరకు శిక్ష విధించింది.

మ్యాచ్‌ ‘టై’.. ఫలితం తేల్చేందుకు
అసలేం జరిగిందంటే.. ఐపీఎల్‌-2025 (IPL 2025)లో భాగంగా ఢిల్లీ సొంత మైదానంలో బుధవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో తలపడింది. అరుణ్‌జైట్లీ స్టేడియంలో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన అక్షర్‌ సేన.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.

సూపర్‌ ఓవర్‌లో గెలిచిన ఢిల్లీ
ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ కూడా 20 ఓవర్ల పూర్తయ్యేసరికి నాలుగు వికెట్లు కోల్పోయి.. 188 పరుగులే చేసింది. ఫలితంగా మ్యాచ్‌ ‘టై’ కావడంతో అంపైర్లు సూపర్‌ ఓవర్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్‌ ఐదు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయి 11 పరుగులు చేయగా.. ఢిల్లీ (2, 4, 1, 6) నాలుగు బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది.

పట్టికలో అగ్రస్థానానికి
ఈ నేపథ్యంలో రాజస్తాన్‌ రాయల్స్‌పై గెలుపొందడంతో పాటు.. సీజన్‌లో ఐదో విజయం అందుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఇదిలా ఉంటే.. ఢిల్లీ- రాజస్తాన్‌ జట్ల మధ్య సూపర్‌ ఓవర్‌ సమయంలో ఢిల్లీ బౌలింగ్‌ కోచ్‌ మునాఫ్‌ పటేల్‌ ఫోర్త్‌ అంపైర్‌తో వాదనకు దిగాడు.

అంపైర్‌తో వాగ్వాదం
బౌండరీ లైన్‌ వద్ద ఫోర్త్‌ అంపైర్‌ నిల్చుని ఉండగా.. అక్కడే కూర్చుని ఉన్న మునాఫ్‌ పటేల్‌ అతడితో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగాడు. మైదానంలో ఉన్న తమ ఆటగాళ్లకు సందేశం చేరవేసేందుకు వేరే ఆటగాడిని పంపాలని భావించగా.. ఫోర్త్‌ అంపైర్‌ అందుకు నిరాకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అతడితో మునాఫ్‌ వాదనకు దిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

జరిమానాతో పాటు
ఈ క్రమంలో ఐపీఎల్‌ పాలక మండలి మునాఫ్‌ పటేల్‌కు జరిమానా విధిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. అంపైర్‌తో అనుచితంగా ప్రవర్తించిన కారణంగా అతడి మ్యాచ్‌ ఫీజులో 25 శాతం మేర కోత విధించడంతో పాటు.. ఓ డీమెరిట్‌ పాయింట్‌ కూడా జతచేసినట్లు వెల్లడించింది. ఐపీఎల్‌ ప్రవర్తనా నియామవళిలోని ఆర్టికల్‌ 2.20 నిబంధనను అతడు ఉల్లంఘించిన కారణంగా ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.

కాగా మునాఫ్‌ పటేల్‌ మార్గదర్శనంలో ఢిల్లీ బౌలింగ్‌ విభాగం రాణిస్తోంది. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటూ జట్టును అగ్రస్థానంలో నిలపడంలో బౌలర్లు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌ను కట్టుదిట్టంగా వేసి.. మ్యాచ్‌ టై కావడానికి ప్రధాన కారణమైన పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌.. సూపర్‌ ఓవర్‌లోనూ అద్భుతం చేసి ఢిల్లీని గెలిపించాడు. తద్వారా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

చదవండి: Rohit Sharma: కమిన్స్‌, స్టార్క్‌ కాదు!.. అతడిని ఎదుర్కోవడమే అత్యంత కష్టం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement