Cheteshwar Pujara: పుజారా గుడ్‌బై | Indian Test specialist Cheteshwar Pujara bids farewell to cricket | Sakshi
Sakshi News home page

Cheteshwar Pujara: పుజారా గుడ్‌బై

Aug 25 2025 12:45 AM | Updated on Aug 25 2025 10:54 AM

Indian Test specialist Cheteshwar Pujara bids farewell to cricket

క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత టెస్టు స్పెషలిస్ట్‌

అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడి  

న్యూఢిల్లీ: టీమిండియా టెస్టు స్పెషలిస్ట్‌ చతేశ్వర్‌ పుజారా... అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆటలోని మూడు ఫార్మాట్ల నుంచి తప్పకుంటున్నట్లు ఆదివారం సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించాడు. 2010లో భారత జట్టు తరఫున అరంగేట్రం చేసిన పుజారా... దశాబ్దానికి పైగా సాగిన తన కెరీర్‌లో జట్టుకు ఎన్నో మరపురాని విజయాలు అందించాడు. టెక్నిక్‌కు పెట్టింది పేరైన 37 ఏళ్ల పుజారా కెరీర్‌లో 103 టెస్టులాడి 43.60 సగటుతో 7195 పరుగులు చేశాడు. అందులో 19 సెంచరీలు, 35 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. 

టెస్టుల్లో గంటల తరబడి క్రీజులో పాతుకుపోయి... ప్రత్యర్థి బౌలర్లను విసిగించడంలో దిట్ట అయిన పుజారా... పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. కెరీర్‌లో 5 వన్డేలు ఆడిన పుజారా 51 పరుగులు చేశాడు. 2018–19లో ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా తొలిసారి టెస్టు సిరీస్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించిన పుజారా... 2020–21 దాన్ని నిలబెట్టుకోవడంలోనూ తన విలువ చాటుకున్నాడు.

2023లో చివరిసారిగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ ఆడిన పుజారా... ఆ తర్వాత తిరిగి జాతీయ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో పేరు ప్రఖ్యాతలు సంపాదించినా... దేశవాళీ మ్యాచ్‌లకు ఎప్పుడూ దూరంకాని పుజారా జట్టులో తిరిగి చోటు దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించినా... సెలెక్టర్లు మరో అవకాశం ఇవ్వలేదు. దీంతో ఇక తప్పుకోవడమే ఉత్తమమని ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 

ప్రశంసల వెల్లువ... 
స్టార్‌ బ్యాటర్లు కోహ్లి, రోహిత్‌తో పాటు స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఈ ఏడాదే టెస్టు క్రికెట్‌ నుంచి తప్పుకోగా... ఇప్పుడు పుజారా కూడా ఆ జాబితాలో చేరిపోయాడు. పుజారా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఓవరాల్‌గా 21,301 పరుగులు చేశాడు. రాహుల్‌ ద్రవిడ్‌ టెస్టు క్రికెట్‌ నుంచి తప్పుకున్న అనంతరం ‘నయా వాల్‌’గా గుర్తింపు పొందిన అతడు... మూడో స్థానంలో బరిలోకి దిగి ఎన్నో మరపురాని ఇన్నింగ్స్‌లు ఆడాడు. కెరీర్‌కు వీడ్కోలు పలికిన పుజారాకు అభినందనలు వెల్లువెత్తాయి. 

‘నువ్వు మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వెళ్లడం చూసినప్పుడల్లా ఎంతో ధైర్యంగా ఉండేది. ప్రశాంతంగా ఆడే తీరు టెస్టు క్రికెట్‌పై నీ ప్రేమను చూపించేది. చక్కటి టెక్నిక్, అంతకుమించిన ఓర్పు, ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కుంటూ జట్టుకు వెన్నెముకగా నిలచేవాడివి. 2018లో ఆ్రస్టేలియాలో టీమిండియా టెస్టు సిరీస్‌ నెగ్గడంలో నీ పాత్ర ఎంతో ఉంది. జీవితంలో కొత్త చాప్టర్‌ మరింత ఆస్వాదించాలని ఆకాంక్షిస్తున్నా’ అని సచిన్‌ ట్వీట్‌ చేశాడు. టీమిండియా కోచ్‌ గంభీర్, మాజీ ఆటగాళ్లు యువరాజ్, సెహ్వాగ్, లక్ష్మణ్, కుంబ్లే, రవిశాస్త్రితో పాటు బీసీసీఐ, సౌరాష్ట్ర క్రికెట్‌ సంఘం రహానే,  గిల్, పుజారాకు అభినందనలు తెలిపారు.

అదే అతిపెద్ద గౌరవం...
అత్యున్నత స్థాయిలో భారత జెర్సీ ధరించడం... జాతీయ గీతం ఆలపించడం... బరిలోకి దిగిన ప్రతిసారీ వంద శాతం ప్రదర్శన చేసేందుకు ప్రయత్నించడం... ఇవన్నీ మాటల్లో చెప్పలేని అనుభవాలు. అయితే ప్రతి దానికి ముగింపు అంటూ ఉంటుంది. అన్ని ఫార్మాట్ల నుంచి వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నా. ఇన్నాళ్ల కెరీర్‌లో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా బీసీసీఐ, సౌరాష్ట్ర క్రికెట్‌ సంఘానికి కృతజ్ఞతలు. కెరీర్‌లో ఎదిగేందుకు వారు ఎంతో తోడ్పాటు అందించారు. 

నా మెంటార్‌లు, కోచ్‌లు, ఆధ్యాత్మిక గురువు, ఇలా అందరి సహకారంతోనే ఈ స్థాయికి వచ్చా. సహచర క్రికెటర్లు, సహాయ సిబ్బంది తోడ్పాటు మరవలేనిది. రాజ్‌కోట్‌ నుంచి వచ్చిన ఓ కుర్రాడు భారత జట్టులో భాగం కావాలనే కలను నెరవేర్చుకున్నాడు. ఎన్నో అవకాశాలు దక్కాయి. వాటి ద్వారా ఎంతో అనుభవం సాధించా. దేశానికి ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నా. ఇక నుంచి కుటుంబానికి మరింత సమయం కేటాయిస్తా.  – వీడ్కోలు సందేశంలో పుజారా

 –సాక్షి క్రీడా విభాగం 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement