శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్ విజయవంతమైన జట్టుగా పేరు తెచ్చుకుంటోంది. ఐపీఎల్-2025లో ఫైనల్కు చేరిన పంజాబ్.. ఈ ఏడాది వరుస విజయాలతో జోరు మీద ఉంది. ఇప్పటికి ఐదు మ్యాచ్లు పూర్తి చేసుకోగా.. ఇందులో ఒకటి వర్షం వల్ల రద్దు కాగా.. మిగిలిన నాలుగూ గెలిచింది.
అగ్రస్థానంలో
తద్వారా తొమ్మిది పాయింట్లు సాధించి.. ప్రస్తుతానికి పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక ఐపీఎల్లో గత కొన్నేళ్లుగా శ్రేయస్ అయ్యర్ జోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కోల్కతా నైట్ రైడర్స్కు 2024లో టైటిల్ అందించిన శ్రేయస్.. 2025లో పంజాబ్ను ఫైనల్కు చేర్చాడు.
కేవలం కెప్టెన్గానే కాకుండా బ్యాటర్గానూ అలరిస్తూ ముందుకు సాగుతున్నాడు శ్రేయస్ అయ్యర్. గతేడాది 604 పరుగులు సాధించిన ఈ ముంబైకర్.. ఈ ఏడాది ఇప్పటికి నాలుగు ఇన్నింగ్స్లో కలిపి 203 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. శ్రేయస్ పంజాబ్ ఫ్రాంఛైజీతో చేరిననాటి నుంచి ఆ జట్టు అభిమానులు తమ కెప్టెన్ను ముద్దుగా సర్పంచ్ సాబ్ అని పిలుచుకుంటున్నారు.
అర్థం ఏమిటో తెలియదు
అయితే, ఫ్యాన్స్ తనను అలా ఎందుకు పిలిచేవారో ముందుగా అర్థం కాలేదన్నాడు శ్రేయస్ అయ్యర్. ఆ తర్వాత జట్టు సభ్యులను అడిగితే అసలు విషయం తెలిసిందన్నాడు. జియోస్టార్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఆ పిలుపు నాకెంతగానో నచ్చింది. అయితే, పంజాబ్ కింగ్స్తో ప్రయాణం మొదలుపెట్టినపుడు సర్పంచ్ సాబ్ అంటే అర్థం ఏమిటో నాకు తెలియదు.
అప్పడు నా సహచర ఆటగాళ్లను అడుగగా.. ‘సర్పంచ్ అంటే.. ఇంటి పెద్ద లేదంటే ఓ సమూహానికి పెద్ద అని అర్థం.. జిల్లా పెద్దను ఇలాగే పిలుస్తారు’ అని చెప్పారు. అప్పటి నుంచి ఈ బిరుదును మరింత ఎక్కువగా ఆస్వాదిస్తున్నాను’’ అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.


