అతడిని వన్‌డౌన్‌లో ఆడిస్తారా?: ఇంగ్లండ్‌ దిగ్గజం ఫైర్‌ | I cant get my head around it: Broad slams GT tactics IPL 2026 final vs GT | Sakshi
Sakshi News home page

అతడిని వన్‌డౌన్‌లో ఆడిస్తారా?: ఇంగ్లండ్‌ దిగ్గజం ఫైర్‌

Jun 1 2026 5:26 PM | Updated on Jun 1 2026 5:37 PM

I cant get my head around it: Broad slams GT tactics IPL 2026 final vs GT

PC: BCCI.IPL

ఐపీఎల్‌-2026 ఫైనల్లో గుజరాత్‌ టైటాన్స్‌ అనుసరించిన వ్యూహాలపై ఇంగ్లండ్‌ దిగ్గజ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ మండిపడ్డాడు. అసలు గుజరాత్‌ నాయకత్వ బృందం ఆలోచన ఏమిటో తనకు అర్థం కాలేదన్నాడు.

జోస్‌ బట్లర్‌ను కాదని నిశాంత్‌ సింధును వన్‌డౌన్‌లో ఎలా ఆడిస్తారని బ్రాడ్‌ ప్రశ్నించాడు. అహ్మదాబాద్‌లో ఆదివారం జరిగిన టైటిల్‌ పోరులో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) చేతిలో గుజరాత్‌ ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

ఈ క్రమంలో బెంగళూరు వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడగా.. గుజరాత్‌ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. కాగా ఆర్సీబీతో ఫైనల్‌ సందర్భంగా గుజరాత్‌ తమ టాపార్డర్‌ను మార్చిన సంగతి తెలిసిందే.

ఆదిలోనే షాక్‌
ఓపెనర్లుగా సాయి సుదర్శన్‌, కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ కొనసాగగా.. వన్‌డౌన్‌లో మాత్రం బట్లర్‌ను కాదని నిశాంత్‌ సింధును ఆడించారు. అయితే, సీజన్‌ ఆసాంతం ఆకట్టుకున్న సాయి ఫైనల్లో 12, గిల్‌ 10 పరుగులే చేయడంతో గుజరాత్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది.

ఇలాంటి తరుణంలో అన్‌క్యాప్డ్‌ నిశాంత్‌ సింధు మూడో స్థానంలో వచ్చి 18 బంతుల్లో 20 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఇక వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌ నాలుగో నంబర్‌ బ్యాటర్‌గా బరిలోకి దిగి 23 బంతుల్లో 19 పరుగులే చేసి నిష్క్రమించాడు.

ఈ నేపథ్యంలో స్టువర్ట్‌ బ్రాడ్‌ గుజరాత్‌ జట్టు యాజమాన్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓ యూట్యూబ్‌ చానెల్‌తో మాట్లాడుతూ.. ‘‘ఈ టోర్నీ ఆసాంత బట్లర్‌ మూడో స్థానంలోనే బ్యాటింగ్‌ చేశాడు. కానీ ఫైనల్లో అనూహ్య రీతిలో అతడిని నాలుగో స్థానానికి మార్చారు.

నాకైతే అర్థం కావడం లేదు
అసలు ఫైనల్లో.. అది కూడా ముందుగా బ్యాటింగ్‌ చేస్తూ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఏబీ డివిలియర్స్‌ సైతం దీనిని ఆత్మరక్షణ ధోరణిగానే అభివర్ణించాడు.

ఇక ఈ సీజన్లో ఓపెనర్లు గిల్‌, సాయి చెరో 700కు పైగా పరుగులు సాధించారు. ఓపెనర్లు ఇంత నిలకడగా రాణించడం మంచిదే. అదే సమయంలో ఇలాంటి ప్రదర్శనల వల్ల మిడిలార్డర్‌ను పరీక్షించేందుకు వీలుకాదు.  

ఇద్దరు ఓపెనర్లు విఫలం కాగానే..
ఒత్తిడిలో వారు ఎలా రాణిస్తారో తెలియదు. టైటిల్‌ పోరులో ఇద్దరు ఓపెనర్లు విఫలం కాగానే.. మిగతా వాళ్లు కూడా పెవిలియన్‌కు క్యూ కట్టేశారు’’ అని స్టువర్ట్‌ బ్రాడ్‌ విమర్శించాడు.

బహుశా అందుకేనేమో!
ఇక ఇదే షోలో ఇంగ్లండ్‌ మరో మాజీ ఆటగాడు స్టీవెన్‌ ఫిన్‌స్పందిస్తూ.. ‘‘ఇంగ్లండ్‌ తరఫున చాలా ఏళ్ల పాటు ఓపెనర్‌గా ఆడిన అనుభవం బట్లర్‌కు ఉంది. అలాంటిది అతడిని డిమోట్‌ చేయడం ఆశ్చర్యకరంగా అనిపించింది.

అయితే, పాత బడుతున్న కొద్దీ వికెట్‌ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని గుజరాత్‌ నాయకత్వ బృందం భావించి ఉంటుంది. కాసేపు నిశాంత్‌ స్టాండింగ్‌ ఇస్తే బట్లర్‌ కుదురుకోగలడని అంచనా వేసి ఉంటుంది. కానీ అదేమీ జరుగలేదు’’ అని పేర్కొన్నాడు.

కాగా గుజరాత్‌ టాపార్డర్‌ కుదేలు కాగా.. ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ అజేయ అర్ధ శతకం (50)తో రాణించాడు. ఫలితంగా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 155 పరుగులు చేయగలిగింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఆర్సీబీ 18 ఓవర్లలో పూర్తి చేసి టైటిల్‌ విజేతగా నిలిచింది.

చదవండి: ఈ ఐదుగురు తమ చివరి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడేశారు?!

Advertisement
 
Advertisement
Advertisement