బుమ్రా ఆడే మూడు టెస్టులేవి? | India Coach Gautam Gambhir Did Not Reveal Which Three Tests Bumrah Will Play, Check More Details | Sakshi
Sakshi News home page

బుమ్రా ఆడే మూడు టెస్టులేవి?

Jun 6 2025 2:03 AM | Updated on Jun 6 2025 4:49 PM

Coach did not reveal which three Tests Bumrah will play

స్పష్టత ఇవ్వని కోచ్‌ గంభీర్‌

ఇంగ్లండ్‌ పర్యటనకు టీమిండియా

ముంబై: భారత స్పీడ్‌స్టర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా స్థానాన్ని భర్తీ చేయడం క్లిష్టమైనప్పటికీ బౌలింగ్‌ దళంలో నైపుణ్యమున్న బౌలర్లు అందుబాటులో ఉన్నారని టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు. ఇంగ్లండ్‌ పర్యటనకు బయలుదేరేముందు కొత్త కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌తో కలిసి అతను మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మొత్తం ఐదు టెస్టుల్లో  బుమ్రా ఆడబోయే మూడు టెస్టులు ఏవనే విషయాన్ని కోచ్‌ వెల్లడించలేదు. 

‘ఐదు టెస్టుల్లో బుమ్రా ఏ ఏ టెస్టులు ఆడతాడనే నిర్ణయానికి ఇంకా రాలేదు. కాబట్టి ఆడే మూడు మ్యాచ్‌లు ఏవో ఇప్పుడే స్పష్టత ఇవ్వలేను. జట్టులో అతనొక అసాధారణ బౌలర్‌. అతని స్థానాన్ని భర్తీ చేయడం అంత సులభం కాదు. ఈ విషయాన్ని ఇంతకుముందే చాంపియన్స్‌ ట్రోఫీ సమయంలోనే చెప్పాను. అయితే ఈ సదవకాశాన్ని నైపుణ్యమున్న బౌలర్లు అందిపుచ్చుకోవాలి. ప్రస్తుతం జట్టులో ప్రతిభావంతులైన పేసర్లకు కొదవలేదు’ అని అన్నాడు. 

రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు కోహ్లి టెస్టులకు గుడ్‌బై చెప్పడంతో కొత్తగా సారథ్యం చేపట్టిన శుబ్‌మన్‌ గిల్‌ కూడా బౌలింగ్‌ అటాక్‌కు వచ్చిన ఇబ్బందేమీ లేదన్నాడు. బుమ్రా పేస్‌ భారం తగ్గించే బౌలర్లు చాలా మంది ఉన్నారని చెప్పాడు. ఒకవేళ ఈ వెటరన్‌ బౌలర్‌ ఆడితే అది జట్టుకు మరింత బలమవుతుందని అన్నాడు. టెస్టు సిరీస్‌ మొదలయ్యాక ఏ మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉంటాడో తెలుసుకున్నాకే అతను ఆడే మూడు మ్యాచ్‌లపై నిర్ణయం తీసుకుంటామని గిల్‌ చెప్పాడు. 

శుక్రవారం తెల్లారేలోపే భారత జట్టు ఇంగ్లండ్‌కు బయలుదేరుతుంది. పూర్తిస్థాయి పర్యటనలో శుబ్‌మన్‌ గిల్‌ సారథ్యంలోని టీమిండియా ఐదు టెస్టుల ద్వైపాక్షిక సిరీస్‌లో పోటీపడుతుంది. ఈ నెల 20 నుంచి లీడ్స్‌లో ఇరు జట్ల మధ్య తొలి టెస్టుతో సిరీస్‌ మొదలవుతుంది. దీనికంటే ముందు భారత జట్టు... ‘ఎ’ జట్టుతో నాలుగు రోజుల వార్మప్‌ మ్యాచ్‌ ఆడుతుంది. ఇంగ్లండ్‌లో ఉన్న భారత్‌ ‘ఎ’ జట్టు ఇంగ్లండ్‌ లయన్స్‌తో అనధికారిక టెస్టులు ఆడుతోంది.

‘అండర్సన్‌–టెండూల్కర్‌’ ట్రోఫీ
భారత్, ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌కు నామకరణం  
న్యూఢిల్లీ: భారత్, ఇంగ్లండ్‌ మధ్య జరిగే టెస్టు సిరీస్‌కు ‘అండర్సన్‌–టెండూల్కర్‌’ ట్రోఫీగా నామకరణం చేశారు. ఆటకు వన్నె తెచ్చిన ఆటగాళ్ల పేర్లను సిరీస్‌లకు పెట్టడం పరిపాటి కాగా... ఇకపై టీమిండియా, ఇంగ్లండ్‌ మధ్య జరిగే సిరీస్‌ను ఈ పేరుతోనే కొనసాగించాలని బీసీసీఐ, ఈసీబీ సమష్టిగా నిర్ణయించాయి. ఈ నెల 20 నుంచి భారత్, ఇంగ్లండ్‌ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ప్రారంభం కానుండగా... దీంతోనే 2025–27 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) చక్రం మొదలవుతుంది. 

తొలి టెస్టు ప్రారంభానికి ముందు ఈ ఇద్దరు దిగ్గజాలు ట్రోఫీని ఆవిష్కరించనున్నట్లు సమాచారం. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ టీమిండియా తరఫున 200 టెస్టు మ్యాచ్‌లు ఆడి 15,921 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు టెస్టు క్రికెట్‌ చరిత్రలో అత్యధిక వికెట్లు (704) తీసిన పేస్‌ బౌలర్‌ అండర్సన్‌ 188 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 

ప్రస్తుతం భారత్, ఇంగ్లండ్‌ మధ్య ఇంగ్లండ్‌లో జరిగే సిరీస్‌ను పటౌడీ ట్రోఫీగా, భారత్‌లో జరిగే సిరీస్‌ను ఆంటోనీ డి మెల్లో ట్రోఫీగా అభివర్ణిస్తున్నారు. ఇక మీద ఇంటా బయట ఎక్కడ సిరీస్‌ జరిగినా దాన్ని ‘అండర్సన్‌–టెండూల్కర్‌’ ట్రోఫీగానే పిలవనున్నారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య సిరీస్‌లను ఇదే మాదిరిగా ‘బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ’గా అభివరి్ణస్తున్న విషయం తెలిసిందే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement