
పుస్తకం రాసిన చతేశ్వర్ పుజారా భార్య పూజ
ఈ నెల 29న విడుదల
న్యూఢిల్లీ: భారత సీనియర్ క్రికెటర్ చతేశ్వర్ పుజారా భార్య పూజా పుజారా కొత్త పుస్తకాన్ని తీసుకురానుంది. ఓ క్రికెటర్ జీవిత భాగస్వామిగా తన అనుభవాలను పూజ పుస్తక రూపమిచ్చింది. ‘ద డైరీ ఆఫ్ క్రికెటర్స్ వైఫ్’ పేరిట ఈ నెల 29న ఆ పుస్తకాన్ని విడుదల చేయనుంది. క్రికెట్ను విపరీతంగా అభిమానించి మన దేశంలో... ఓ ఆటగాడి జీవితంలో అటు గ్రౌండ్లో ఇటు ఇంట్లో ఎదురైన ఎత్తుపల్లాలను పూజ ఇందులో ప్రస్తావించింది. ‘చతేశ్వర్ పుజారా చాలా మొండివాడు. ఒక పట్టాన దేన్ని అంగీకరించడు. అదే సమయంలో సున్నిత మనసు్కడు, పబ్లిసిటీకి దూరంగా ఉంటాడు.
అయితే అతడి దగ్గర దాచడానికి ఏమీ లేదు. దైవంపై నమ్మకం ఎక్కువ. హాస్యాన్ని ఇష్టపడతాడు. రాజ్కోట్ వీధుల నుంచి అంతర్జాతీయ క్రికెటర్గా ఎదిగిన అతడి ప్రయాణం ఎంతో ప్రత్యేకం. అందులో భాగం అయ్యే అవకాశం నాకు దక్కడం ఆనందంగా ఉంది. చతేశ్వర్ జీవితంతో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారని నమ్ముతున్నా. అందుకోసమే ఇంత సమయం కేటాయించి పుస్తకాన్ని తీసుకు వస్తున్నా’ అని పూజా పుజారా వెల్లడించింది.క్రికెట్పై కనీస అవగాహన లేకుండానే 2013లో అతడిని వివాహమాడిన పూజా... ఆ తర్వాతి కాలంలో స్పోర్ట్స్ న్యూట్రీషియన్గా మారింది.
ఓ క్రీడాకారుడి భాగస్వామి పుస్తకం రాయడం ఇదే తొలిసారి. ఈ నెలాఖరులో మార్కెట్లోకి రానున్న పుస్తకంపై భారత దిగ్గజ ఆటగాళ్లు అనీల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసలు కురిపించారు. పుజారాను సమీపం నుంచి గమనించిన పూజా... అతడి జీవితంలోనే భిన్న పార్శా్వలను స్పృషించిందని ద్రవిడ్ కితాబిచ్చాడు. కష్టాన్ని నమ్ముకుంటే ఒక వ్యక్తి ఎంతటి విజయం సాధించగలడనే అంశం ఈ పుస్తకం చదివితే అర్థం అవుతుందని పేర్కొన్నాడు.