ఫోన్‌ చూసిన రోమీ, వైభవ్‌ సూర్యవంశీ.. షాకిచ్చిన బీసీసీఐ! | BCCI Sends Notice To RR Official Over Anti Corruption Protocol Breach: Report | Sakshi
Sakshi News home page

BCCI: ఫోన్‌ చూసిన రోమీ, వైభవ్‌ సూర్యవంశీ.. బీసీసీఐ కఠిన చర్యలు!

Apr 13 2026 11:00 AM | Updated on Apr 13 2026 11:16 AM

BCCI Sends Notice To RR Official Over Anti Corruption Protocol Breach: Report

PC: BCCI/RR

రాజస్తాన్‌ రాయల్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. రాయల్స్‌ టీమ్‌ మేనేజర్‌ రోమి భిందర్‌పై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) కఠిన చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం. ఇందులో భాగంగా అనినీతి వ్యతిరేక, భద్రతా విభాగం అతడికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

అగ్రస్థానంలో
ఐపీఎల్‌-2026లో సూపర్‌ ఫామ్‌ కొనసాగిస్తున్న రాజస్తాన్‌ రాయల్స్‌.. శుక్రవారం నాటి మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB)ని చిత్తు చేసింది. తద్వారా ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లు నాలుగూ గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో రాయల్స్‌ ఓపెనర్‌, పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీ పాత్ర కీలకం.

అయితే, ఆర్సీబీతో మ్యాచ్‌ సందర్భంగా రాజస్తాన్‌ టీమ్‌ మేనేజర్‌ రోమీ భిందర్‌ చేసిన పని వివాదానికి దారితీసింది. డగౌట్లో కూర్చుని అతడు మొబైల్‌ ఫోన్‌ను చూశాడు. ఆ సమయంలో వైభవ్‌ సూర్యవంశీ సైతం పక్కనే కూర్చుని ఫోన్‌లోకి చూసినట్లుగా ఉన్న దృశ్యాలు వైరల్‌ అయ్యాయి.

రంగంలోకి బీసీసీఐ
కాగా ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా (PMOA) నిబంధనల ప్రకారం.. మ్యాచ్‌ జరుగుతున్న వేళ డగౌట్లో మొబైల్‌ ఫోన్లు వాడటం నిషిద్ధం. ఇలా చేయడం ద్వారా అవినీతి నిరోధక ప్రొటోకాల్‌ నిబంధనలను ఉల్లంఘించినట్లే లెక్క. ఈ నేపథ్యంలో బీసీసీఐ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కథనం ప్రకారం.. ఈ ఘటనపై విచారణలో భాగంగా బీసీసీఐలోని యాంటీ కరప్షన్‌ అండ్‌ సెక్యూరిటీ యూనిట్‌ (ACSU) రోమీ భిందర్‌కు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో నలభై ఎనిమిది గంటల్లోగా.. తాను ఆరోజు ఫోన్‌ ఎందుకు ఉపయోగించానన్న విషయంపై రోమీ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ విషయాన్ని ఐపీఎల్‌ పాలక మండలి చైర్మన్‌ అరుణ్‌ ధుమాల్‌ ధ్రువీకరించాడు. ‘‘ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు జరిపి.. నివేదిక ఇవ్వాల్సిందిగా మేము ACSUను ఆదేశించాము’’ అని ధుమాల్‌ తెలిపాడు.

PC: BCCI
అందుకే ఫోన్‌ చూశాడా?
ఈ విషయంపై రోమి భిందర్‌ సన్నిహిత వర్గాలు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘అనారోగ్యం కారణంగా రోమీ దాదాపుగా పది కిలోల బరువు తగ్గిపోయాడు. అతడికి ఆస్తమా కూడా ఉంది. అందుకే దూరప్రయాణాలు చేయొద్దని, మెట్లు ఎక్కడం తగ్గించాలని వైద్యులు సూచించారు.

అయితే, టీమ్‌ మేనేజర్‌గా ఫ్రాంఛైజీ తరపున అతడు ఎన్నెన్నో వ్యవహారాలు చక్కబెట్టాల్సి ఉంటుంది. అతడికి నిబంధనలు తెలుసు. ఆరోజు కూడా వైద్యపరమైన కారణాల వల్లే అతడు ఫోన్‌ చూశాడు. హెల్త్‌ ఎమర్జెన్సీ సమయాల్లో డగౌట్లో కూర్చుని ల్యాప్‌టాప్‌ లేదంటే మొబైల్‌తో కనిపించడం తప్పేమీ కాదు.

నిజానికి అతడు ఫోన్‌ కాల్స్‌ మాట్లాడుతూనే.. ఎవరికైనా ఫోన్‌ చేస్తున్నట్లుగానో కనిపించలేదు. కేవలం అతడు ఫోన్‌ను స్క్రోల్‌ చేశాడంతే. ACSU విచారణలో అతడు తాను చేసిన పని గురించి వివరణ ఇవ్వగలడు. 

అతడి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ACSU విచారణ జరుపుతుందని భావిస్తున్నాం. డ్రెస్సింగ్‌ రూమ్‌కి వెళ్లి ఫోన్‌ చూసుకోవచ్చు. కానీ అక్కడికి వెళ్లాలంటే కనీసం 50 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. అందుకే అతడు అక్కడే కూర్చుని ఫోన్‌ చూసి ఉంటాడు’’ అని పేర్కొన్నాయి.

చదవండి: Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement