టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ-2025లో ఆడేందుకు అతడు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయం గురించి ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) వర్గాలు వార్తా సంస్థ PTIకి వెల్లడించాయి.
కాగా టీమిండియాకు టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిళ్లను అందించిన రోహిత్ శర్మ (Rohit Sharma).. తొలుత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు.. అనంతరం టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అనూహ్య రీతిలో ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనకు ముందు అతడిని వన్డే కెప్టెన్సీ తప్పించింది బీసీసీఐ.
మునుపెన్నడూ లేని విధంగా
ఈ క్రమంలో ఫిట్నెస్పై దృష్టి సారించిన రోహిత్ శర్మ.. దాదాపు 10 కిలోల బరువు తగ్గాడు. మునుపెన్నడూ లేని విధంగా మరింత ఫిట్గా మారి.. ఆసీస్ గడ్డ మీద శతకంతో చెలరేగిన హిట్మ్యాన్.. సౌతాఫ్రికాతో స్వదేశంలో వన్డేల్లోనూ అదరగొట్టాడు. అయితే, ప్రస్తుతం రోహిత్తో పాటు మరో దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు.
ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్కప్-2027కి సిద్ధమయ్యే క్రమంలో రో-కో మ్యాచ్ ప్రాక్టీస్ గురించి చర్చలు వచ్చాయి. ఇలాంటి సమయంలో బీసీసీఐ భారత జట్టులోని ప్రతి సభ్యుడు కచ్చితంగా కనీసం రెండు దేశీ మ్యాచ్లు అయినా ఆడాలని ఆదేశించింది. రో-కోలకే కాకుండా ప్రతి ఒక్క ఆటగాడికి ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.
ఢిల్లీ జట్టులో విరాట్ కోహ్లి
అయితే, ఎంసీఏ చీఫ్ సెలక్టర్ సంజయ్ పాటిల్ శుక్రవారం మాట్లాడుతూ.. రోహిత్ శర్మ ముంబై జట్టుకు అందుబాటులో లేడని తెలిపాడు. ఈ క్రమంలోనే ఢిల్లీ విజయ్ హజారే ట్రోఫీకి ప్రకటించిన జట్టులో తొలి రెండు మ్యాచ్లకు విరాట్ కోహ్లి అందుబాటులో ఉంటాడని స్పష్టం చేసింది.
ఈ పరిణాల క్రమంలో శుక్రవారం రాత్రి ఎంసీఏ వర్గాలు మరోసారి రోహిత్ శర్మ విషయంపై స్పందిస్తూ.. అతడు కనీసం రెండు మ్యాచ్లకు అవైలబుల్గా ఉంటాడని స్పష్టం చేశాయి. కోహ్లి పేరు ప్రకటన తర్వాత రోహిత్ సైతం ఈ మేర యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ముంబై జట్టుకు చెందిన టీమిండియా స్టార్లు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఆల్రౌండర్ శివం దూబే విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లకు అందుబాటులో ఉండటం లేదు. టీ20 ప్రపంచకప్-2026 దృష్ట్యా వారిద్దరికి మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇక యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, ముంబై మాజీ కెప్టెన్ అజింక్య రహానే అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత జట్టుతో చేరే అవకాశం ఉంది. కాగా డిసెంబరు 24 నుంచి విజయ్ హజారే ట్రోఫీ టోర్నీ మొదలుకానుంది.
చదవండి: విరాట్ కోహ్లి ఫ్యాన్స్కు శుభవార్త.. కెప్టెన్గా రిషభ్ పంత్


