గజ్వేల్లో రెబల్స్ గోల
పార్టీల నేతలకు తలనొప్పి
● బుజ్జగించేందుకు యత్నం ● మున్సిపాలిటీలో వేడెక్కిన రాజకీయం
గజ్వేల్: రెబల్స్ లొల్లి.. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికలో పార్టీలకు గండంలా మారింది. వీరివల్ల గెలిచే స్థానాలను ఓడిపోతామా...? అనే ఆందోళన ముఖ్య నేతలను వెంటాడుతోంది. బీఆర్ఎస్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తున్నది. ఈ పార్టీకి 2, 3, 6, 15, 18, 20 వార్డుల్లో రెబెల్స్ నుంచి ముప్పు పొంచి ఉన్నది. ఇప్పటికే ఆయా వార్డుల్లో ఇద్దరేసి అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వారిలో ఒకరిని సముదాయించి, పోటీనుంచి తప్పించేలా చేయడం నేతలకు కత్తిమీదసాములా మారింది. ఇప్పటికే పార్టీ నేతలు అధికారిక అభ్యర్థులు ఎవరనే విషయంలో స్పష్టతకు వచ్చారు. ఈ క్రమంలోనే అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారు చేసిన వారిని వార్డుల్లో విస్తృతంగా ప్రచారం చేసుకోవాలని కూడా సూచించారు. ఈ మేరకు సదరు అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేసుకోగా.. వారికి పోటీగా రెబల్స్ కూడా ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వార్డుల వారీగా నిర్వహిస్తున్న పార్టీ సమావేశాలకు సమాచారం ఉందో లేదో తెలియదు కానీ..వాటికి కూడా హాజరుకావడం లేదు. కొందరు నేతల వల్లే తాము బీ–ఫాంకు దూరం కావాల్సి వస్తున్నదని మండిపడుతున్నారు. బీజేపీలోనూ 18వ వార్డులో ఈ పరిస్థితి కనిపిస్తున్నది. కాంగ్రెస్లోనూ పలు వార్డుల్లో ఈ పరిస్థితి నేతలకు ఇబ్బందికరంగా మారింది. నామినేషన్ల విత్డ్రా ఈనెల 3లోగా ఈ పరిస్థితిలో మార్పులు ఉంటాయా..? అనేది వేచి చూడాల్సి ఉంది.


