
కుటుంబ సభ్యులకు చిన్నారి అప్పగింత
సిద్దిపేటకమాన్: బస్టాండ్లో తప్పిపోయిన పాపను పోలీసులు వివరాలు సేకరించి రెండు గంటల వ్యవధిలోనే వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. సిద్దిపేట పట్టణం టెలికాంనగర్లో నివాసం ఉంటున్న శివరాత్రి రాజు, స్వప్న దంపతులు తమ కూతురు హారిక (6), తమ అమ్మానాన్నతో కలిసి నివాసం ఉంటున్నారు. పాప నానమ్మ యాదమ్మ పట్టణంలోని హౌసింగ్ బోర్డు వద్ద చెరుకు రసం బండి నిర్వహిస్తోంది. శుక్రవారం సాయంత్రం పాప ఆడుకుంటూ బయటకు వచ్చి ఆర్టీసీ నూతన బస్టాండ్ వద్దకు చేరుకుని బస్సు ఎక్కింది. ఆర్టీసీ సిబ్బంది గమనించి పాప పేరు, వివరాలు, అమ్మానాన్న పేర్లు అడగ్గా ఎలాంటి వివరాలు తెలుపలేదు. విషయం తెలుసుకున్న సిద్దిపేట వన్ టౌన్ పోలీస్స్టేషన్ బ్లూకోట్ సిబ్బంది బస్టాండ్ వద్దకు చేరుకుని విషయాన్ని ఉన్నతాధికారులకు తెలపడంతో పాటు పాప ఫొటోను అన్ని వాట్సప్ గ్రూప్లలో షేర్ చేశారు. పాపను బాలసదనానికి తరలించారు. పాప తప్పిపోయిన విషయం వైరల్ కావడంతో పాప కుటుంబం నివాసం ఉంటున్న కాలనీ వారు పాపను గుర్తించి పాప నానమ్మకు తెలిపారు. దీంతో వారు బాలసదనానికి చేరుకోగా పాప తమ మనవరాలేనని ఆధారాలు చూపించడంతో పోలీసు సిబ్బంది వారికి అప్పగించారు. గంటల వ్యవధిలో చిన్నారిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.