
స్థానికంగా సత్తా చాటుదాం
గజ్వేల్రూరల్: త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ అన్నారు. ఆదివారం గజ్వేల్ మండలం కొడకండ్లలో డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మంత్రి హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, ఇప్పటి నుంచే కార్యకర్తలు సమష్టిగా ముందుకు సాగాలని కోరారు. మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో ముంపు బాధితులను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారన్నారు. సీఎం రేవంత్రెడ్డి దృష్టికి వారి సమస్యలను తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు రంగారెడ్డి, భూంరెడ్డి, ఎలక్షన్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, హరికృష్ణ, నరేందర్రెడ్డి, విజయమోహన్, సర్ధార్ఖాన్ పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్
కొడకండ్లలో కార్యకర్తల సమావేశం