
లక్ష్యం.. దారుణం..!
2024–25లో లక్ష్యంచేరని పంట రుణాలు
● రూ.7,601 కోట్లకు గాను రూ.5,640కోట్లు మంజూరు ● మొండిచేయి చూపిన పలు బ్యాంకులు ● ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నఅన్నదాతలు
సాక్షి, సిద్దిపేట: జిల్లాలో పంట రుణాలు లక్ష్యం మేరకు అందించడం లేదు. ప్రతీ సంవత్సరం రుణ లక్ష్యాన్ని పెంచి ప్రణాళిక విడుదల చేస్తున్న బ్యాంకర్లు.. పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు. 2024–2025 ఆర్థిక సంవత్సరం రూ.7,601 కోట్లు వ్యవసాయ రంగానికి రుణ లక్ష్యం కాగా.. రూ 5,640 కోట్లు మాత్రమే అందించారు. కొన్ని బ్యాంకులు లక్ష్యం మేరకు ఇస్తున్నా.. మరికొన్ని అసలు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దీంతో పలువురు రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది.
వ్యవసాయ రంగానికే ప్రాధాన్యత
వార్షిక రుణ ప్రణాళికలో వ్యవసాయ రంగానికే అగ్రభాగం ఉంటుంది. 70 శాతానికి పైగా ఈ రంగానికే అందించాలన్న లక్ష్యాన్ని నిర్ణయిస్తారు. వానాకాలం, యాసంగి పంట రుణాలు, అనుబంధ రంగ రుణాలకే అధిక ప్రాధాన్యం ఇస్తారు. కానీ రైతులకు ప్రతీ ఏడాది రుణాలను అందించడంలో పలు బ్యాంకులు మొండిచేయి చూపిస్తున్నారు. పంట రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం దక్కడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. పాత రుణాలు చెల్లిస్తేనే కొత్తవి ఇస్తామని సాకులు చెబుతుండటంతో రైతులు రుణాలపై ఆశలు వదులుకుంటున్నారు. 2023–24లో రూ 4,509 కోట్ల రుణాలు అందించారు. రాష్ట్ర ప్రభుత్వం పంట రుణాలు రూ.900 కోట్ల వరకు రుణమాఫీ చేయడంతో 2024–25లో బ్యాంకు రుణాలు కొంత మేరకు పెరిగినప్పటికీ లక్ష్యం చేరుకోలేదు.
17న వార్షిక రుణ ప్రణాళిక విడుదల
ప్రతీ ఏడాది జిల్లా వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్ అధ్యక్షతన లీడ్బ్యాంక్ విడుదల చేస్తారు. 2025–26 సంవత్సరపు వార్షిక రుణ ప్రణాళికను ఈ నెల 17న విడుదల చేసేందుకు లీడ్ బ్యాంక్ అదికారులు సిద్ధం చేస్తున్నారు. దాదాపు రూ.10వేల కోట్లు వార్షిక రుణ ప్రణాళిక ఉండే అవకాశం ఉంది. అందులో వ్యవసాయ రంగానికి దాదాపు రూ 8,600 కోట్లు ఉండనుంది. ఈ సంవత్సరం అయితే రైతులకు పంట రుణాలు వంద శాతం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఆ బ్యాంక్లకు టార్గెట్లుపెంచుతున్నాం
వ్యవసాయ రంగానికి రుణాలు ఇవ్వని బ్యాంక్లకు ఈ ఏడాది టార్గెట్ను పెంచుతున్నాం. బ్యాంకర్లతో ప్రతీ మూడు నెలలకు ఒకసారి కలెక్టర్ అధ్యక్షతన సమావేశాలు నిర్వహించి టార్గెట్లు రీచ్ కావాలని అదేశిస్తున్నాం.
– హరిబాబు, లీడ్ బ్యాంక్ మేనేజర్
ప్రైవేట్ వ్యాపారుల దగ్గరకు..
పలు బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో పంటల సాగు కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారు. అన్నదాతలు ఎప్పటి మాదిరిగానే ప్రైవేట్ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో పండించిన పంట ద్వారా వచ్చిన ఆదాయం అంతా వడ్డీలకే సరిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోతుండటంతో మరింత అప్పుల పాలవుతున్నారు.

లక్ష్యం.. దారుణం..!

లక్ష్యం.. దారుణం..!