
వారంలో ఒక రోజొస్తా
● సిద్దిపేటతో నాకు మంచి సంబంధం ● కార్మికశాఖ మంత్రి వివేక్
ప్రశాంత్నగర్(సిద్దిపేట): సిద్దిపేటకు వారంలో ఒక రోజు వస్తానని, కార్యకర్తలకు అండగా నిలుస్తానని, కార్మికశాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ అన్నారు. శనివారం హైద్రాబాద్ నుంచి చెన్నూరు వెళుతూ.. మార్గమధ్యలో సిద్దిపేటలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి అందరం కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం తదితర పథకాలు ప్రజల్లోకి వెళ్లాయన్నారు. అన్ని సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే విధంగా, అందరం కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. తన తండ్రి వెంకటస్వామి ఎంపీగా ఉన్నప్పుడు సిద్దిపేటతో మంచి సంబంధాలు ఉండేవన్నారు. మళ్లీ సిద్దిపేటకు ఇన్చార్జీగా రావడం సంతోషంగా ఉందన్నారు. సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం తీసుకొద్దామని చెప్పారు. అంతకు ముందు వివేక్కు జిల్లా కేంద్రంలో నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నర్సిరెడ్డి, హరికృష్ణ, దరిపల్లి చంద్రం, అత్తు ఇమామ్, లక్ష్మీ, బొమ్మల యాదగిరి, కలీమొద్దీన్, గోపికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.