
4,315 కేసులు పరిష్కారం
కేసుల పరిష్కారానికిలోక్ అదాలత్ సరైన వేదిక
● న్యాయమూర్తి వై జయప్రసాద్
సిద్దిపేటకమాన్: క్షణికావేశంలో చేసిన తప్పులను, పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించుకోవడానికి లోక్అదాలత్ సరైన వేదిక అని సిద్దిపేట ఇన్చార్జి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ అండ్ సెషన్స్ న్యాయమూర్తి వై జయప్రసాద్ అన్నారు. సిద్దిపేట న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం సిద్దిపేట కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో రాజీ మార్గం ద్వారా న్యాయమూర్తులు పలు కేసులను పరిష్కరించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జయప్రసాద్ మాట్లాడుతూ.. జాతీయ లోక్ అదాలత్లో 4,274 క్రిమినల్, 32 సివిల్ కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. 9 మోటారు ప్రమాద కేసులలో రూ.1,29,62,000 బాధితులకు ఇప్పించామన్నారు. మొత్తం 4,315 కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. లోక్ అదాలత్లో కేసు రాజీ అయితే మళ్లీ అప్పీలుకు వెళ్లే అవకాశం ఉండదన్నారు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి సమయం వృథా చేసుకోకుండా లోక్ అదాలత్లో కేసును పరిష్కరించుకుంటే సమయం ఆదా అవుతుందన్నారు. కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ ఇన్చార్జి సెక్రటరీ, న్యాయమూర్తి మిలింద్ కాంబ్లె, న్యాయమూర్తులు సంతోష్కుమార్, సాధన, తరణి, వన్టౌన్ సీఐ వాసుదేవరావు, టూటౌన్ సీఐ ఉపేందర్, త్రీ టౌన్ సీఐ విద్యాసాగర్, రూరల్ సీఐ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
రాజీమార్గంతో ఇద్దరూ గెలిచినట్లే: జడ్జి రేవతి
హుస్నాబాద్: పట్టణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్అదాలత్కు అనూహ్య స్పందన లభించింది. హుస్నాబాద్లోని కోర్టు హాలులో జరిగిన జాతీయ లోక్ అదాలత్కు ప్రిన్సిపల్ సివిల్ కోర్టు జూనియర్ న్యాయమూర్తి రేవతి అధ్యక్షత వహించారు. ఇరువర్గాల రాజీతో మొత్తం 361 కేసులు పరిష్కారమయ్యాయి. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ..పలు కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్న కక్షిదారులు లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కక్షిదారులు రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకుంటే ఇద్దరు గెలిచిన వారవుతారని న్యాయమూర్తి రేవతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పీపీ నాగరాజు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, న్యాయవాదులు కన్నోజు రామకృష్ణ, ప్రవీణ్ పాల్గొన్నారు.