జహీరాబాద్: ప్రపంచ చిరుధాన్యాల దినోత్సవాన్ని పురస్కరించుకుని చిరుధాన్యాల వంటల ప్రదర్శన ఆకట్టుకుంది. ఆదివారం మండలంలోని పస్తాపూర్ గ్రామంలో గల డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డీడీఎస్) ఆవరణలో డీడీఎస్–కేవీకే ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఝరాసంగం మండలం బిడబకన్నెకు చెందిన చంద్రమ్మ–బుజ్జమ్మ 28 రకాల వంటలు, మొగులమ్మ 27 రకాల వంటలు, డిగ్రీ కళాశాల విద్యార్థినులతో గ్రామాలకు చెందిన 20 మంది మహిళలు తయారు చేసిన వంటలను ప్రదర్శించారు. ప్రదర్శనలో ముఖ్యంగా శనగ, గోధుమ, జొన్న గుడాలు, పచ్చ, నల్ల బటానీ, శనగ, అనప గుడాలు, కొర్ర, తైద, సజ్జ, జొన్న, లంక, శనగ మురుకులు, ముల్లు గోధుమ నూనెపోలెలు, నువ్వుల కారం, ఎవ్వ మదిన, బెల్లం బజ్జీలు, తాలుకల పాయసం, పప్పు బక్షాల ప్రదర్శనలో పెట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేవీకే గృహ విజ్ఞాన శాస్త్రవేత్త హేమలత మాట్లాడుతూ.. పిల్లలకు చిన్నప్పటి నుంచే చిరుధాన్యాలు తినే అలవాటు చేయించాలని సూచించారు. దేశంలో ప్రతి వంద మందిలో 10 మంది వరకు మధుమేహంతో బాధపడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీకళాశాల లెక్చరర్లు ఇస్కర్ ఇష్రత్ సుల్తానా, రాములు, వైద్యురాలు విజయలక్ష్మి, కేవీకే శాస్త్రవేత్త వరప్రసాద్, మహిళా రైతులు పాల్గొన్నారు.
ప్రపంచ చిరుధాన్యాల దినోత్సవం సందర్భంగా వంటల ప్రదర్శన


