జహీరాబాద్ టౌన్: భారీ వర్షాలు కురవకపోయినా తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర సరిహద్దులోని మొగుడంపల్లి మండలం గౌసాబాద్ జలపాతం పరవళ్లు తొక్కుతోంది. కొండపై నుంచి నీరు జాలువారుతుండటంతో ప్రకృతి అందాలు, నీటి పరవళ్లను తిలకించేందుకు సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు. సజ్జరావు పేట తండా ప్రాంతంలో గల జాడిమల్కాపూర్ వాటర్ ఫాల్ (ఎత్తిపోతల) వద్ద కూడా జలకళ సంతరించుకుంది.
నారాయణఖేడ్: పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ పథకం దోహదపడుతుందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. మనూరు మండలం బోరంచలో ఆదివారం ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి గృహ ప్రవేశాలు నిర్వహించారు. ఈసందర్భగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం కేవలం డబుల్ బెడ్రూం ఇళ్ల పేరిట పేదలను మభ్యపెట్టేందుకే పరిమితమయ్యిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు ఇళ్లు దక్కాయన్నారు. లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణాలు చేసుకోవాలని కోరారు. బిల్లులు సైతం సకాలంలోనే ఖాతాల్లో జమవుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు భోజిరెడ్డి, బెల్లాపూర్ సర్పంచ్ దిగంబర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మెదక్ కలెక్టరేట్: కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను వెంటనే అమలు చేయాలని పీఆర్టీ యూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మల్లారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ.. సీపీఎస్ విధానం ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆశనిపాతంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వెంటనే అమలు చేయాలన్నారు. పీఆర్సీ బకాయిలను విడుదల చేయాలని, ప్రధానమైన మూడు డిమాండ్లతో సెప్టెంబర్ 1న హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద మహాధర్నా చేపడుతున్నట్లు చెప్పారు. జిల్లాలోని పీఆర్టీయూ నాయకులతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయులంతా పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో పీఆర్టీయూ జిల్లా మాజీ అధ్యక్షుడు తాళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మిరుదొడ్డి(దుబ్బాక): వృత్తి రీత్యా చేసిన మంచి సేవలే సమాజంలో మంచి గుర్తింపునిస్తాయని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. మండల పరిధిలోని అల్వాల చెప్యాల క్రాస్ రోడ్డులో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల,కళాశాల ప్రిన్సిపాల్ రఘునందన్రావు ఉద్యోగ విరమణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి శారదతో కలిసి ప్రిన్సిపాల్ రఘునందన్రావు దంపతులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...వృత్తి రీత్యా పదవీ విరమణ సర్వసాధారణమన్నారు.


