● కావేరి యూనివర్సిటీ వీసీ డాక్టర్ ప్రవీణ్రావు
● వివిధ రంగాల ప్రముఖులకు సత్కారం
వర్గల్(గజ్వేల్): మహిళాశక్తి అపారమని అవకాశం దక్కితే వారు అద్భుత ఫలితాలు సాధిస్తారని కావేరి యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ ప్రవీణ్రావు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం మండలంలోని గౌరారం కావేరి యూనివర్సిటీలో ‘శక్తి నేషనల్ లీడర్షిప్ కాంక్లేవ్–2026’ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు, అధ్యాపకులలో స్ఫూర్తిని నింపడమే ధ్యేయంగా వివిధ రంగాల ప్రముఖ మహిళా సాధకులను ఒకే వేదికపైకి తీసుకొచ్చారు. ఉపన్యాసం, సాంస్కృతిక ప్రదర్శనలు, ముఖాముఖి సెషన్ ద్వారా మహిళా నాయకత్వం, ఆత్మస్థైర్యం, సమాజానికి అందించిన సేవలు పేర్కొంటూ స్ఫూర్తిని నింపారు. ఈ సందర్భంగా వారిని సన్మానించారు. ప్రముఖ మహిళలతో ‘శక్తి’ కార్యక్రమం విద్యార్థుల ఉన్నత లక్ష్యాలకు ప్రేరణగా నిలుస్తుందని వీసీ పేర్కొన్నారు. ఆభాస రిహాబ్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ గాయత్రి అరవింద్, ఎస్ఎంఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ మంజులరావు, ఐకార్ రిటైర్డ్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ విశారద, లాంగ్ డిస్టెన్స్ రన్నర్, గిన్నిస్ వరల్డ్ రికార్డు హోల్డర్ సోఫియా సూఫీ, స్ట్రాటజీ, బిజినెస్ మెర్క్సియస్ మాజీ సీఈఓ వైశాలి నియోజియా, క్లాసికల్ డ్యాన్సర్ విదుషి దీక్ష తమ అనుభవాలను వివరించారు. విద్యార్థులు మానసిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఉద్యోగం కోసం చూడకుండా తామే ఉద్యోగాలు సృష్టించేలా ఎదగాలన్నారు. ఈ సందర్భంగా అంజలి బృందం సాంస్కృతిక ప్రదర్శన ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ శ్రీనివాసులు, డైరెక్టర్ హర్ష పోలసాని, డీన్లు డాక్టర్ కొండ శ్రీనివాస్, డాక్టర్ ప్రతాప్కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


