మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్
జోగిపేట(అందోల్): అందోలు–జోగిపేట మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు సరైన ప్రాతినిధ్యం కల్పించకుండా కాంగ్రెస్ మోసం చేసిందని, దానికి మంత్రి దామోదర రాజనర్సింహనే కారణమని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆరోపించారు. జోగిపేటలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ఈ ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తుంటే ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు.
ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదాన్ని ఎత్తుకుందని ఆయన ఎద్దేవా చేశారు. అందోల్–జోగిపేట మున్సిపల్ చైర్మన్ పదవిని బీసీ వర్గాలకు కాకుండా ఓసీలకు కేటాయించడం విడ్డూరంగా ఉందని, బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాలను గెలుచుకుంటే చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను బీసీలకు కేటాయిస్తామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో అన్ని పార్టీ కులాలకు ప్రాధాన్యత కల్పిస్తూ అభ్యర్థులను ప్రకటించినట్లు తెలిపారు.
ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ నెరవేర్చలేకపోయిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు గుణపాఠం చెప్పేందుకు సిద్ధమయ్యారన్నారు. జోగిపేట మున్సిపల్ పరిశీలకులు నరహరిరెడ్డి, మాజీ ఎంపీపీ రామాగౌడ్, పి.నారాయణ, మాజీ ఏఎంసీ చైర్మన్ నాగభూషణం, సీనియర్ నాయకులు డి.వీరభద్రారావు పలువురు నాయకులు పాల్గొన్నారు.


