
రసాయన డ్రమ్ముల దహనం.. బ్లాస్టింగ్
భయంతో పరుగులు తీసిన తగలబెట్టిన వ్యక్తులు, స్థానికులు
పటాన్చెరు టౌన్: ఓ పరిశ్రమకు చెందిన రసాయన డ్రమ్ములను డంప్యార్డ్ సమీపంలో తగలబెట్టడంతో పేలుడు సంభవించి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ ఘటన బుధవారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాశమైలారం పారిశ్రామికవాడలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... ఓ పరిశ్రమ వారు డంప్యార్డ్ సమీపంలో రసాయన డ్రమ్ములను తగలబెట్టడంతో ఒక్కసారిగా పేలాయి. ఈ హఠాత్పరిణామానికి తగలబెట్టిన వ్యక్తులు, స్థానికులు దూరంగా పరుగులు తీశారు. స్థానికులు ద్వారా సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనతో చుట్టూ ఉన్న చెట్లు కాలిపోయాయి. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.