
రెడీ అవుతున్న భారత హై స్పీడ్ రైల్
రూ.1,08,000 కోట్ల వ్యయం
గంటకు 320 కిలోమీటర్ల గరిష్ఠ వేగం
ముంబై టు సబర్మతి.. రెండు గంటల్లోనే 2028లో సాకారం కానున్న ప్రాజెక్టు
పనుల్లో వేగం పెంచిన రైల్వే శాఖ
దేశీయ ప్రయాణికుల రవాణా వ్యవస్థలో వందే భారత్ రైలు ఒక పెద్ద ముందడుగు. సౌకర్యవంత ప్రయాణ అనుభూతికి ఈ రైలు ప్రసిద్ధి. గంటకు గరిష్ఠంగా 180 కిలోమీటర్ల వేగంతో కూడా ప్రయాణించగలదు. దీన్ని మించిన వేగంతో దూసుకుపోయే ‘హై స్పీడ్ రైల్’ కొద్దిరోజుల్లో పట్టాలెక్కనుంది. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక ముంబై–అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ (ఎంఏహెచ్ఎస్ఆర్) ప్రాజెక్టు వేగం పుంజుకుంది. 2026 నాటికి పాక్షిక కార్యకలాపాలు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే 2028 నాటికి ప్రాజెక్ట్ పూరై్త బుల్లెట్ రైల్ దూసుకెళ్లనుంది. తద్వారా ప్రపంచంలో హై స్పీడ్ రైల్ వ్యవస్థ కలిగిన అతికొద్ది దేశాల సరసన భారత్ నిలవనుంది. – సాక్షి, స్పెషల్ డెస్క్
హైస్పీడ్ రైలు ప్రాజెక్టు కోసం 300 కి.మీ. వయాడక్ట్లు పూర్తయినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల తెలిపారు. ముంబై–అహ్మదాబాద్ కారిడార్ పొడవు 508 కిలోమీటర్లు. బుల్లెట్ రైలు గంటకు 320 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణించనుంది. ముంబైలో మొదలై సూరత్, వడోదర, అహ్మదాబాద్ స్టాప్స్నకు పరిమితమైతే చివరి స్టాప్ అయిన సబర్మతికి 2 గంటల 7 నిమిషాల్లోనే ఈ రైలు చేరనుంది. అన్ని స్టాప్స్లోనూ ఆగితే 2 గంటల 58 నిమిషాల సమయం తీసుకుంటుంది. ఈ కారిడార్లో 12 స్టేషన్లు ఉన్నాయి. వీటిలో గుజరాత్లో ఎనిమిది, మహారాష్ట్రలో నాలుగు ఉన్నాయి. ముంబై స్టేషన్స్ భూగర్భంలో నిర్మిస్తుండగా మిగిలిన థానే, విరార్, బోయిసర్, వాపి, బిలిమోరా, సూరత్, భరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతి వద్ద ఎలివేటెడ్ స్టేషన్స్ రానున్నాయి.
సముద్రగర్భ రైల్ టన్నెల్..
బుల్లెట్ రైలు కారిడార్లో 21 కిలోమీటర్ల పొడవైన సముద్రగర్భ రైల్ టన్నెల్ ప్రత్యేక ఆకర్షణ. ఇది ముంబై–థానే మధ్య ఏర్పాటవుతోంది. ఇందులో భారత్లోనే మొట్టమొదటి 7 కి.మీ. పొడవైన సముద్రగర్భ సొరంగం కూడా ఉంది. 13.1 మీటర్ల వ్యాసం కలిగిన ఒకే ట్యూబ్ సొరంగంలో రెండు ట్రాక్లు ఉంటాయి. ముంబై–అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్టులో 465 కి.మీ. మేర ఎలివేటెడ్ కారిడార్ ఉంటుంది. ప్రధానంగా ఫుల్ స్పాన్ లాంచింగ్ మెథడ్ ఉపయోగించి నిర్మిస్తున్నారు. వయాడక్ట్ నిర్మాణంలో ఉపయోగించే సంప్రదాయ సెగ్మెంటల్ నిర్మాణ సాంకేతికత కంటే ఇది 10 రెట్లు వేగంగా ఉంటుంది. ఈ ప్రత్యేకమైన నిర్మాణ పద్ధతిని దేశంలో మొదటిసారిగా ఉపయోగిస్తున్నారు. ఈ సాంకేతికతను ఉపయోగించే, నైపుణ్యం సాధించిన ప్రపంచంలోని అతి కొద్ది దేశాలలో భారత్ ఒకటి.
ట్రయల్ రన్ గుజరాత్లో..
ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్న నేషనల్ హై–స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకారం.. 383 కి.మీ. పీయర్ పనులు, 401 కి.మీ. ఫౌండేషన్, 326 కి.మీ. గర్డర్ క్యాస్టింగ్ కూడా పూర్తయ్యాయి. ఇప్పటివరకు రూ.67,486 కోట్లు ఖర్చయ్యాయి. ప్రాజెక్టు పూర్తి అయ్యేసరికి వ్యయం భారీగా పెరిగే అవకాశం ఉంది. 2026లో మొదటి ట్రయల్ రన్ గుజరాత్లో 50 కి.మీ.లో నిర్వహించనున్నారు. ఢిల్లీ–వారణాసి, చెన్నై–మైసూరు వంటి కారిడార్లలో హెచ్ఎస్ఆర్ ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరుగుతోంది. ముంబై–హైదరాబాద్, ఢిల్లీ–అçßæ్మదాబాద్ కారిడార్లు పరిశీలనలో ఉన్నాయి.
ఆటంకాలు దాటుకుని..
కోవిడ్–19 మహమ్మారి, మహారాష్ట్రలో భూసేకరణ, అనుమతుల జాప్యం.. వంటి కారణాలు బుల్లెట్ రైలు ప్రాజెక్టును రెండున్నరేళ్లు వెనక్కి నెట్టాయి. మౌలిక సదుపాయాలు, రోలింగ్ స్టాక్, సిగ్నలింగ్ వ్యవస్థ ఖరీదు భారం కావడం వంటి సవాళ్లను ఎదుర్కొంది. భారత రైల్వేల సొంత ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, ప్రభుత్వ అధీనంలో ఉన్న బీఈఎంఎల్ను సంయుక్తంగా 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రెండు ప్రోటోటైప్ రైలు సెట్లను (ఒక్కొక్కటి ఎనిమిది కార్లు) రూపొందించి తయారు చేయడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది.
ఆర్థిక సహాయంతోపాటు భారత్లో సమాచార సేకరణ, పరీక్షల కోసం రెండు షింకన్సెన్ రైళ్లను (జపాన్ బుల్లెట్ రైళ్లు) 2026 నాటికి జపాన్స్ ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్స్ ఏజెన్సీ (జికా) ఉచితంగా సరఫరా చేయనుంది. సిగ్నలింగ్ వ్యవస్థకు ప్రత్యామ్నాయాలను అందించేందుకు ఆల్స్టమ్–ఎల్అండ్టీ, డీఆర్ఏ–సీమెన్స్ ్స జాయింట్ వెంచర్లు టెండర్ల కోసం బిడ్డింగ్ చేస్తున్నాయి.
హెచ్ఎస్ఆర్గా పరిగణించాలంటే..
హై–స్పీడ్గా పరిగణించాలంటే రైళ్లు వాటి కోసం ప్రత్యేకంగా కేటాయించిన ట్రాక్లపై గంటకు 250 కి.మీ. కంటే ఎక్కువ వేగంతో వెళ్లాలి. సాధారణంగా వీటికి నూతన, ప్రత్యేకంగా రూపొందించిన మార్గాలు అవసరం. కొన్ని హెచ్ఎస్ఆర్ వ్యవస్థలు ప్రస్తుత నెట్వర్క్లోని కొంత ట్రాక్లను ఉపయోగిస్తాయి. అధిక వేగానికి తగ్గట్టుగా ట్రాక్లలో మార్పు, సిగ్నలింగ్ను మెరుగుపరచడం వంటివి చేయాల్సి ఉంటుంది. కఠిన భద్రతా ప్రమాణాలు, తగినంత విద్యుత్ సరఫరా, శిక్షణ పొందిన ఆపరేటింగ్ సిబ్బంది, మెరుగైన నిర్వహణ తప్పనిసరి.
వాటి అనుభవాల నుంచి..
జపాన్, ఫ్రాన్స్ ్స, జర్మనీతో సహా అభివృద్ధి చెందిన దేశాల్లో హై స్పీడ్ రైల్ నెట్వర్క్ ఉంది. ప్రపంచంలో అతిపెద్ద హెచ్ఎస్ఆర్ నెట్వర్క్ ఉన్న దేశం చైనా. ఇండోనేషియా, ఉజ్బెకిస్తాన్ వంటి మధ్య ఆదాయ దేశాలు సైతం హెచ్ఎస్ఆర్ జాబితాలో ఉన్నాయి. ఇప్పటికే హెచ్ఎస్ఆర్ నెట్వర్క్లను కలిగి ఉన్న దేశాల్లో పరిస్థితులపై పూర్తిస్థాయిలో మనం అధ్యయనం చేయాలి. అలాగే బుకింగ్స్ సమస్యలు (ఉజ్బెకిస్తాన్స్ ), భారీ నిర్వహణ వ్యయాలు (చైనా), శబ్ద కాలుష్యం (జపాన్స్ ) వంటి విషయాల్లో ఈ నెట్వర్క్లు ఎదుర్కొన్న విమర్శలపైనా దృష్టిపెట్టాలి. అప్పుడే మన బుల్లెట్ రైలు బ్రేకులు లేకుండా యమస్పీడుగా దూసుకెళ్తుంది.
రూ.లక్ష కోట్ల ప్రాజెక్టు
ముంబై–అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ (ఎంఏహెచ్ఎస్ఆర్) ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,08,000 కోట్లు. ఇందులో 81 శాతం నిధులను జపాన్స్ ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్స్ ఏజెన్సీ (జికా) ద్వారా జపాన్స్ ప్రభుత్వం సమకూరుస్తోంది. ఈ ప్రాజెక్టులో రైల్వే మంత్రిత్వ శాఖకు 50 శాతం, మహారాష్ట్ర, గుజరాత్కు చెరి 25 శాతం వాటా ఉంది. మొత్తం 1,389.5 హెక్టార్ల భూమిని సమీకరించారు.
బుల్లెట్ రైల్.. ఇతర హైలైట్స్
⇒ ముంబై–అహ్మదాబాద్ కారిడార్ పొడవు 508 కిలోమీటర్లు.
⇒ బుల్లెట్ రైలు గరిష్ఠ వేగం గంటకు 320 కి.మీ.
⇒ 2028 నాటికి దూసుకెళ్లనున్న బుల్లెట్ రైల్
⇒ పరిమిత స్టాప్స్తో 2 గంటల 7 నిమిషాల్లోనే ప్రయాణం
⇒ అన్ని స్టాప్స్లో ఆగితే 2 గంటల 58 నిమిషాల సమయం