
విద్యా విధానంలో ఉన్నత ఫలితాలు సాధించాలి
శంకర్పల్లి: భారతదేశం 2047 నాటికి ప్రధానమంత్రి మోదీ ఆశించినట్లుగా విద్యావిధానంలో ఉన్నత ఫలితాలను సాధించాలని ఏఐసీటీఈ (ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యూకేషన్) చైర్మన్ ప్రొ.టీజీ సీతారాం అన్నారు. దొంతాన్పల్లిలోని ఇక్ఫాయ్ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం నిర్వహించిన జాతీయ విద్యావిధానం 2020పై అంతర్జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాలుగేళ్ల క్రితం దేశంలో ప్రవేశపెట్టిన ‘జాతీయ విద్యావిధానం 2020’ అద్భుతంగా పని చేస్తోందని కొనియాడారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొనే ఈ విద్యావిధానం ప్రవేశపెట్టామని, దీనికి కేంద్ర ప్రభుత్వం ఏటా పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయిస్తోందని వెల్లడించారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయడమే ఈ విద్యావిధానం ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా విద్యావిధానం మార్చుకోవడం ద్వారా వేర్వేరు ప్రాంతాల్లో బహుళ సంఖ్యలో విశ్వవిద్యాలయాలు వచ్చాయని, దీంతో విద్యార్థులు ఎంతో లబ్ధి పొందుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వైస్ చాన్సలర్ డా. ఎండీ వెంకటేశ్ ఆన్లైన్ ద్వారా, ఇక్ఫాయ్ వైస్ చాన్సలర్ ప్రొ. ఎల్ఎస్ గణేశ్ తదితరులు పాల్గొన్నారు.