● ఎస్పీ మహేశ్ బీ గితే
వేములవాడరూరల్: బాధితులు ఇచ్చే ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని ఎస్పీ మహేశ్ బీ గితే సూచించారు. మంగళవారం వేములవాడరూరల్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్పరిధిలో కేసుల వివరాలు, రికార్డులను పరిశీలించారు. కేసుల దర్యాప్తులో అలసత్వం ప్రదర్శించకుండా నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలన్నారు. రౌడీషీటర్లు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలని ఆదేశించారు. రానున్న బక్రీద్ పండుగ సందర్భంగా స్టేషన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టాలన్నారు. తరచూ వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విజిబుల్ పోలీసింగ్లో భాగంగా అధికారులు గ్రామాలను నిరంతరం సందర్శిస్తూ ప్రజలతో మమేకమై సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలన్నారు. వాహనదారులకు హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కలిగే అనర్థాలు, మైనర్ డ్రైవింగ్పై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రజలు, వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. గంజాయి, జూదం లాంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ శ్రీనివాస్, ఎస్సై వెంకట్రాజం, సిబ్బంది పాల్గొన్నారు.


