మా కాలనీలో వేయి మందిమి ఉంటున్నాం. తాగునీటి పైపులైన్ పాడై మూడేళ్లుగా గోస పడుతున్నాం. ట్యాంకర్ల ద్వారా నీరు పోస్తున్నా సరిపోవడం లేదు. డబుల్బెడ్రూమ్ గృహాల్లో పై అంతస్తుల్లో ఉండేవాళ్లు ట్యాంకర్ నుంచి బిందెలతో మోసుకుపోయేందుకు ఇబ్బందులు పడుతున్నారు. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. మా కాలనీలోని ట్యాంకు పూర్తయితేనే మాకు నీళ్ల బాధ తీరుతుంది.
– మంచాల పుష్పలత, డబుల్బెడ్రూం కాలనీ, పెద్దూరు
ఏడాదిగా గోస పడుతున్నం
ఏడాదిగా నీళ్లకు అరిగోస పడుతున్నం. ఎండాకాలం మొదలైనప్పటి నుంచి వార్డులో ఏ బోరులో నీరుంటే అక్కడికి పోయి తెచ్చుకుంటున్నాం. తాగునీటి కోసం నల్లాలు పెట్టే వ్యక్తిని అడిగితే కోపానికి వస్తుండు. అడుగంగ..అడుగంగ ట్యాంకర్ పంపిస్తారు. తాగడానికి నీళ్లు సాలవు. పొలాల వద్ద వ్యవసాయ బావుల వద్ద మొగోళ్లు తానాలు చేస్తుండ్రు. ఆడోళ్లు అరిగోస పడుతుండ్రు. – గొర్రె పద్మ, ఇప్పలపల్లె
ప్రత్యేక నిధులు వెచ్చించాం
మానేరులో రూ.5లక్షలతో పైపులైన్ ద్వారా పెద్దూరు, శివారుపల్లెలకు నీరందిస్తాం. మిషన్ భగీరథ నీళ్లు రాకుంటే ట్యాంకర్లు పంపుతాం. ప్రజల అవసరాలను బట్టి కొత్త బోర్లు వేయిస్తున్నాం. పట్టణంలో 17 మోటార్లు రిపేర్లు చేయిస్తున్నాం. సిబ్బంది, అధికారులతో నిరంతరం పర్యవేక్షిస్తున్నాం.
– జిందం కళ, మున్సిపల్ చైర్పర్సన్
కంట్రోల్రూమ్ ఏర్పాటు చేశాం
సిరిసిల్ల, విలీనగ్రామాల్లో ప్రత్యేకంగా సమ్మర్ ప్లాన్ అమలు చేస్తున్నాం. తాగునీటి సమస్యపై చర్యలు తీసుకునేందుకు కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. 78935 93330కు ఫోన్ చేస్తే సత్వరమే పరిష్కరిస్తాం. నీళ్లు రాని ప్రాంతాలకు ట్యాంకర్లు ద్వారా అందిస్తున్నాం. డబుల్బెడ్రూమ్ కాలనీకి ట్యాంకర్లు పంపిస్తున్నాం. పట్టణంలో పాడైన పవర్బోర్లను రిపేర్లు చేయిస్తున్నాం.
– ఎం.ఎ.ఖదీర్పాషా, మున్సిపల్ కమిషనర్


