ఏడాది పాలనలో కలెక్టర్‌ మార్క్‌ | - | Sakshi
Sakshi News home page

ఏడాది పాలనలో కలెక్టర్‌ మార్క్‌

Jun 16 2025 5:14 AM | Updated on Jun 16 2025 5:14 AM

ఏడాది పాలనలో కలెక్టర్‌ మార్క్‌

ఏడాది పాలనలో కలెక్టర్‌ మార్క్‌

సిరిసిల్ల: జిల్లా కలెక్టర్‌గా పని చేయడం ఐఏఎస్‌ అధికారుల సర్వీసులో అరుదైన అవకాశం. జిల్లా పాలనాధికారిగా అన్ని ప్రభుత్వ శాఖలపై ఆజమాయిషీ ఉండే బాధ్యత. కలెక్టర్‌గా సందీప్‌కుమార్‌ ఝా 2024 జూన్‌ 16న విధుల్లో చేరారు. ఆయన బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. జిల్లాకు వచ్చినప్పుటి నుంచి తనదైన శైలిలో ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. నిత్యం క్షేత్రస్థాయి పర్యటనలు, ఆకస్మిక తనిఖీలతో జిల్లాలో విద్య, వైద్య సేవలు సామాన్యులకు మెరుగ్గా అందేలా కృషి చేస్తున్నారు.

విద్యపై ప్రత్యేక దృష్టి

చదువు ఒక్కటే సమాజాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుందని గుర్తించిన కలెక్టర్‌ పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. తరచూ తనిఖీలు చేస్తూ.. పిల్లలకు నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకున్నారు. చదువులో వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. అనేక సందర్భాల్లో ఉపాధ్యాయుడిగా మారి పాఠాలు బోధించారు. విద్యార్థులకు ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టారు. వేసవిలో ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ తరగతులకు వెళ్లి.. గురువులకే గురువుగా మారి బోధనాంశాల్లో మెలకువలు చెప్పారు. ఇలా జిల్లాలో విద్యపై ప్రత్యేక దృష్ఠిసారించారు. పదో తరగతి, ఇంటర్‌ ఫలితాల్లోనూ జిల్లాను ముందు వరసలో ఉంచారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుని విద్యా వ్యవస్థను క్రమశిక్షణలో ఉంచారు.

సర్కారు వైద్యంపై నమ్మకం పెంచేలా..

జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచేలా వైద్యసేవలు విస్తరించేలా కలెక్టర్‌ తరచూ తనిఖీలు చేశారు. సిరిసిల్ల ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రితో పాటు, వేములవాడ ప్రాంతీయ వైద్యశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తరచూ తనిఖీలు చేశారు. ఆస్పత్రుల్లో రోగులతో మాట్లాడుతూ, వారికి అందుతున్న సేవలను ఆరా తీశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసూతి సేవలు అందేలా, అనవసరపు సిజేరియన్లు చేయకుండా కట్టడి చేశారు. పీహెచ్‌సీల్లోనూ డెలివరీలు చేయాలని సూచించారు. మాతా, శిశు మరణాలు లేకుండా, పేదలకు పౌష్టికాహారం అందేలా ఐసీడీఎస్‌ అధికారులతో తరచూ సమీక్షించారు. వృద్ధాశ్రమాలను తనిఖీ చేస్తూ, వారి యోగక్షేమాలను పర్యవేక్షించారు.

‘దివ్య’మైన ఉపాధి

జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక చొరవతో ట్రాన్స్‌జెండర్ల ఉపాధికి సిరిసిల్ల రెండో బైపాస్‌ రోడ్డులో పెట్రోల్‌ బంక్‌ ఏర్పాటు చేశారు. అక్కడ లభించే రూ.10వేలతో తాము బతకలేమని ట్రాన్స్‌జెంటర్లు పెట్రోల్‌ బంక్‌లో పని చేసేందుకు నిరాకరించారు. వెంటనే ఆ పెట్రోల్‌ బంక్‌ను దివ్యాంగుల ఉపాధికి కేంద్రంగా మార్చారు. ప్రత్యేకంగా తన కోటాలో నిధులు కేటాయించి బంక్‌ నిర్వహణకు అండగా నిలిచారు. ప్రస్తుతం 16 మంది దివ్యాంగులు ఉపాధి పొందుతున్నారు. ఇది జిల్లాలో కలెక్టర్‌ మార్క్‌ కార్యం. మరో వైపు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఏడు వేల మంది లబ్ధిదారులకు నేరుగా మంజూరు పత్రాలను అన్ని మండలాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అందించడం విశేషం. రాష్ట్రంలో ఏ కలెక్టర్‌ చేయని విధంగా ఇందిరమ్మ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు.

వేములవాడ ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ

దైవభక్తి ఎక్కువగా ఉన్న కలెక్టర్‌ వేములవాడ ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అద్దె భవనంలో ఉన్న ఆలయ అభివృద్ధి అథారిటీ ఆఫీస్‌ను కలెక్టరేట్‌కు మార్చుకున్నారు. ఎప్పుడు సమయం దొరికినా జిల్లాలోని ముఖ్యమైన ఆలయాలను సందర్శిస్తున్నారు.

విద్య, వైద్యంపై తనదైన ముద్ర

బడిలో టీచర్‌గా పాఠాలు బోధిస్తూ..

పేదలకు మెరుగైన వైద్యసేవలు అందేలా..

జిల్లా కలెక్టర్‌గా సందీప్‌కుమార్‌ ఝా ఏడాది అడుగుజాడలు

ప్రతీ వారం సమీక్షలు

నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటించడం, అదే స్థాయిలో ప్రభుత్వ శాఖలపై నిర్దిష్టమైన రోజు సమీక్షించడం కలెక్టర్‌ నైజం. ఎంతో ఓపికగా.. గంటల తరబడి అలసిపోకుండా ప్రభుత్వ శాఖలపై సమీక్షిస్తున్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను మహిళా సంఘాలకు కట్టబెట్టి రూ.7కోట్ల కమీషన్‌ వచ్చేలా చేశారు. మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు, విద్యార్థులకు కంటి పరీక్షలు, నిరుద్యోగులకు జాబ్‌ మేళాలు, ప్రభుత్వ భూములను పరిరక్షించడం, ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేయడంలో ప్రగతిశీలంగా.. ప్రభావంతంగా పని చేశారు. కలెక్టర్‌గా కొన్ని వివాదాలు ఆయన్ని చుట్టు ముట్టినా, అవేమీ లెక్కచేయకుండా.. తనదైన శైలిలో సందీప్‌కుమార్‌ ఝా పాలనాధికారిగా ఏడాది పూర్తి చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement