
రాజన్న గోశాలలో సిబ్బంది నియామకానికి ఇంటర్వ్యూలు
సిరిసిల్ల: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ గోశాలలో సిబ్బంది నియామకానికి ఇంటర్వ్యూలను శనివారం కలెక్టరేట్లో నిర్వహించారు. 40 పోస్టులకు 250 మంది దరఖాస్తు చేసుకోగా 200 మంది హాజరయ్యారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా, జిల్లా ఉపాధి కల్పనాధికారి రాఘవేందర్, జిల్లా అధికారులు కలిసి అభ్యర్థులకు నిర్వహించారు. అర్హత కలిగిన 40 మందిని ఎంపికచేసి వారికి నియామకపత్రాలు అందజేస్తామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రకటించారు.
రక్తదానం ప్రాణదానంతో సమానం
సిరిసిల్ల: రక్తదానం ప్రాణదానంతో సమానమని, మనం ఇచ్చే రక్తం వేరొకరి ప్రాణాలను కాపాడుతుందని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎస్.రజిత పేర్కొన్నారు. స్థానిక అంబేడ్కర్నగర్ ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శనివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ రక్తదానంతో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయన్నారు. గుండె సంబంధిత వ్యాధులు, గొంతు, పెద్ద పేగు క్యాన్సర్లు, సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ సంపత్కుమార్, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ అనిత, డాక్టర్ అభినయ్, డాక్టర్ నయిమా జహా పాల్గొన్నారు.
మెడికల్ కాలేజీలో..
సిరిసిల్ల మెడికల్ కాలేజీలోనూ రక్తదాతల దినో త్సవం నిర్వహించారు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.లక్ష్మీనారాయణ రక్తదానం చేసి అందరిలో స్ఫూర్తి నింపారు. ఆ యన మాట్లాడుతూ రక్తం మానవ శరీరంలోనే ఉత్పత్తి అవుతుందని ఏ ఫ్యాక్టరీలోనూ రక్తం లభించదన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు రక్తదానం చేయాలని సూచించారు. జిల్లా జనరల్ ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ ఎం.లక్ష్మీనారాయణ, మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.అరుణ్, బి.స్వాతి, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
ఉద్యమ పాఠ్యాంశం తొలగింపు దుర్మార్గం
సిరిసిల్లటౌన్: పాఠ్యపుస్తకాల్లో నుంచి తెలంగాణ ఉద్యమ పాఠ్యాంశాన్ని తొలగించడం దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీశ్ పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ శనివారం సిరిసిల్లలో అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. పదో తరగతి పుస్తకంలో తెలంగాణ ఉద్యమచరిత్ర పాఠ్యాంశాన్ని కాంగ్రెస్ సర్కారు తొలగించడం నాలుగున్నర కోట్ల ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉందన్నారు. తొలగించిన పాఠ్యాంశాన్ని వెంటనే చేర్చాలని డిమాండ్ చేశారు. నాయకులు ఎస్.కే.బాబా, మెట్టల సాయి, దీపక్, వెంకటరమణ, అశోక్, భరత్, విజయ్ పాల్గొన్నారు.

రాజన్న గోశాలలో సిబ్బంది నియామకానికి ఇంటర్వ్యూలు