
దశాబ్దాల కల.. ఫలిస్తున్న వేళ
● వేములవాడలో 80 ఫీట్ల రోడ్ల విస్తరణ ● 343 మంది నిర్వాసితులకు పరిహారం సిద్ధం ● ఇప్పటికే 50 మందికి చెక్కులు పంపిణీ
సిరిసిల్ల: వేములవాడ రాజన్న ఆలయం ఎదుట రోడ్ల విస్తరణకు తొలి అడుగు పడింది. మూలవాగు వంతెన నుంచి ఆలయం వరకు ఉన్న ఇరుకురోడ్డుతో భక్తులు, పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గుడి ముందు రోడ్లను 80 ఫీట్ల మేరకు విస్తరించాలని నిర్ణయించారు. ఈమేరకు షాపులు, ఇళ్లను కోల్పోయే నిర్వాసితులకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఇప్పటికే 40 మందికి శుక్రవారం చెక్కులను పంపిణీ చేయగా.. తాజాగా శనివారం పది మంది నిర్వాసితులకు చెక్కులను కలెక్టర్ సందీప్కుమార్ ఝా, వేములవాడ ఆర్డీవో, ఆలయ ఇన్చార్జి ఈవో రాధాబాయి అందించారు. రోడ్డు విస్తరణతో 343 మంది తమ ఇళ్లను, షాపులను కోల్పోతున్నారు. ప్రజాప్రయోజనాల కోసం భూములు, ఇంటి స్థలాలను ఇస్తున్న నిర్వాసితులకు చెక్కులను అందించడంతో రోడ్డు విస్తరణకు మార్గం సుగమమైంది. పరిహారం తీసుకోకుండా కోర్టుకు వెళ్లే వారి సొమ్మును కోర్టులో డిపాజిట్ చేసే అవకాశం ఉంది. నిర్వాసితులు పరిహారం చెక్కులు తీసుకోవడంతో రోడ్డు విస్తరణకు అడ్డంకులు తొలగిపోయాయి. ఇక పనులు చకచక సాగనున్నాయి.