అదుపులోకి అగ్నికీలలు
టంగుటూరు: మండల కేంద్రంలో బెల్లం కోటయ్యకు చెందిన పొగాకు గూడెంలో శనివారం రాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంఘటన తెలిసిందే. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడటంతో శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు మంటలు అదుపు చేసే పనిలో అగ్నిమాపక యంత్రాంగం నిమగ్నమయ్యారు. ఆదివారం సాయంత్రం వరకు గోడౌన్లో సహాయక చర్యలు కొనసాగాయి. ఈ సహాయక చర్యల్లో టంగుటూరు, కొండపి, ఒంగోలు అగ్నిమాపక కేంద్ర సిబ్బంది మంటలను అదుపు చేసినా ఎంతకు అదుపులోకి రాకపోవడంతో కందుకూరు నుంచి మరో అగ్నిమాపక వాహనాన్ని తెప్పించారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటల తర్వాత మంటలు అదుపులోనికి రావడంతో ఆయా వాహనాలను పంపించి వేశారు. టంగుటూరు వాహనం సిబ్బంది మాత్రం ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రమాద సంఘటన జరిగిన ప్రాంతాన్ని విజయవాడ నుంచి అగ్నిమాపక శాఖ రీజనల్ అధికారి జిలానీ, డీఎఫ్ఓ శ్రీకాంత్రెడ్డి సందర్శించారు. ప్రమాదంలో 600 బేళ్లు అగ్నికి ఆహుతైనట్లు జీపీఐ సిబ్బంది తెలిపినట్లు డీఎఫ్ఓ తెలిపారు. ఆస్తినష్టం అంచనా మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉందన్నారు.


