ఆర్టీసీలో మౌలిక వసతులపై శ్రద్ధ చూపండి
ఒంగోలు టౌన్: స్థానిక ఆర్టీసీ బస్టాండ్ను కలెక్టర్ పి.రాజాబాబు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రయాణికుల ఇబ్బందులను స్వయంగా పరిశీలించేందుకు బస్టాండ్ మొత్తం కలియతిరిగారు. డిపోలోని పరిస్థితులను గమనించారు. బస్టాండులో ఉన్న రద్దీ, మరుగుదొడ్ల పరిస్థితి, పార్కింగ్ సదుపాయాలను పరిశీలించారు. మౌలిక వసతులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒంగోలు నగరానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వచ్చిపోతుంటారని, వారికి అవసరమైన మౌలిక వసతుల కల్పనపై మరింత శ్రద్ధ చూపాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, పారిశుధ్యంపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పార్కింగ్ ప్రదేశాన్ని పరిశీలించి మాట్లాడుతూ.. సదుపాయాలపై మరింత దృష్టి సారించాలని చెప్పారు. వారం రోజుల్లో సమగ్ర ప్రణాళిక రూపొందించి తనకు నివేదిక అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. నెల రోజుల్లో డిపో రూపురేఖలు మార్చే విధంగా గణనీయమైన మార్పులు చేపట్టాలని స్పష్టం చేశారు. తనిఖీల్లో జిల్లా ప్రజా రవాణా అధికారి జి.సత్యనారాయణ, ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ మధుసూదనరావు, డిపో మేనేజర్ ఘట్టమనేని శ్రీనివాసరావు, ట్రాఫిక్ సూపర్వైజర్ ఫణికుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ రాజాబాబు


