నా సభలకు మహిళలు రావడం లేదు
ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నా రావడం లేదు మార్కాపురం సభలో సీఎం చంద్రబాబు ఆవేదన సోషల్ మీడియాలో వీడియో వైరల్
మార్కాపురం: మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నప్పటికీ తన సభలకు వారు రావడం లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం మార్కాపురం సభలో మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలైంది. సీ్త్ర శక్తి పథకంతో మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ సౌకర్యం కల్పించినప్పటికీ తన మీటింగుకు తక్కువ సంఖ్యలో వారు వచ్చారని సీఎం అన్నారు. ‘నేనడుగుతున్నా.. నాకు మీరిచ్చే కానుక.. నేను ఎక్కడికొస్తే అక్కడ అధిక సంఖ్యలో ఆడబిడ్డలు కనబడితే నాకు కొండంత ధైర్యం. ముందుకు పోవడానికి బాగుంటుంది’ అని సీఎం మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. మహిళలు తక్కువ సంఖ్యలో హాజరుకావడంతో మార్కాపురం టీడీపీ నేతలపై కూడా సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సీఎం సభ ప్రారంభం కాకముందే కొందరు వెళ్లిపోగా, ప్రారంభమైన కొద్దిసేపటికే మరికొంతమంది మహిళలు వెళ్లిపోవడంపై కూడా సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.


