
నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా జరుపుకోండి
● ఎస్పీ ఏఆర్ దామోదర్
ఒంగోలు టౌన్: గణేష్ నిమజ్జనాలను ప్రశాంత వాతావరణంలో ఉత్సాహంగా జరుపుకోవాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ సూచించారు. భద్రత దృష్ట్యా భక్తులు తగిన జాగ్రతలు తీసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ వద్ద ఉభ్భ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలీసు గణనాథుడు విగ్రహం వద్ద పూజలు చేశారు. అనంతరం నిమజ్జన ఊరేగింపును ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...గణేష్ నిమజ్జనం సందర్భంగా భక్తులు, కమిటీ ప్రతినిధులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నీటిలోతు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోకి విగ్రహాలను తీసుకొని వెళ్లరాదని స్పష్టం చేశారు. ఈత రానివారు ఎట్టి పరిస్థితులలోనూ నీటిలోకి దిగవద్దని సూచించారు. మద్యం తాగి నిమజ్జనంలో పాల్గొనవద్దన్నారు. విగ్రహాల ఊరేగింపు సజావుగా కొనసాగేందుకు పోలీసు పర్యవేక్షణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉత్సవ నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు. ఏవైనా సమస్యలు ఉంటే పోలీసులకు సమాచారం అందివ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ కె.శ్రీనివాసరావు, ఆర్ఐలు రమణారెడ్డి, సీతారామి రెడ్డి, ఆర్ఎస్సైలు ప్రసాద్, మాల్యాద్రి, తిరుపతి స్వామి పాల్గొన్నారు.
● ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
కంభం: ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన మండలంలోని చిన్నకంభం సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళితే..మండలంలోని నల్లకాల్వ గ్రామానికి చెందిన పెద్దిబోయిన చిన్నకాశయ్య(32) ఆదివారం రాత్రి కంభం నుంచి నల్లకాల్వకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా జేబీకేపురం రైల్వేగేటు దాటిన తర్వాత వరినారు కోసం వెళ్తున్న వంగపాడుకు చెందిన పసుపుల చెన్నయ్య ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ప్రమాదానికి గురైన ఇద్దరిని 108లో కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చిన్నకాశయ్య అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మరో ద్విచక్రవాహనం ఉన్న పసుపుల చెన్నయ్యకు కాళ్లకు, చేతులకు ఇతర శరీర భాగాలకు తీవ్ర గాయాలు కాగా వైద్యశాలలో ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం మార్కాపురం తరలించారు. కంభం పోలీసులు వైద్యశాలకు చేరుకొని వివరాలు సేకరించారు.

నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా జరుపుకోండి