ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకుని..
గిద్దలూరు రూరల్: పాఠశాల, కళాశాల నాటి రోజులను తలచుకుని మైమరచిపోని వారంటూ ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాంటిది.. ఆనాడు కలిసి చదువుకున్న వారంతా ఎన్నో ఏళ్ల తర్వాత ఒకచోట కలిస్తే ఆ ఆనందానికి హద్దే ఉండదు. ఇలాంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనాలను జిల్లాలోని నాలుగు ప్రాంతాల్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. దశాబ్దాల తర్వాత కలుసుకున్న వారంతా తమ చిన్ననాటి మధుర స్మృతులు, ఆనాడు చేసిన అల్లర్లను నెమరువేసుకోవడంతో పాటు ప్రస్తుతం వారి పరిస్థితులు, ఇన్నేళ్ల జీవితంలో వారికి ఎదురైన అనుభవాలు పంచుకుంటూ ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు.
40 ఏళ్ల తర్వాత కలుసుకున్న పదో తరగతి విద్యార్థులు...
చీమకుర్తి: చీమకుర్తి ప్రభుత్వ హైస్కూల్లో 1985–86లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మే ళనం నిర్వహించారు. పూర్వ విద్యార్థుల సహకారంతో ఇప్ప టి వరకు నిర్వహించిన సేవా కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. వారికి విద్య నేర్పించిన గురువులను సత్కరించారు. అనంతరం పూర్వ విద్యార్థిలో ఒకరైన ఏఎంసీ మాజీ చైర్మన్ మారం వెంకారెడ్డి, గొల్లపూడి వెంకట్రావును, ట్యూషన్ చెప్పిన టీచర్లను సత్కరించారు. దాదాపు 40 సంవత్సరాల క్రితం పదో తరగతి చదువుకున్న విద్యార్థులంతా కలుసుకుని ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుని ఆనందంగా గడిపారు. వివిధ స్థాయిల్లో ఉన్న వారంతా కలిసి కుశల ప్రశ్నలు వేసుకుని ఆనాటి మధుర స్మృతులను గుర్తుచేసుకున్నారు.
జిల్లాలో నాలుగు చోట్ల పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు
చిన్ననాటి జ్ఞాపకాలతో ఆనందంగా గడిపిన పెద్దలు
మధుర స్మృతులు నెమరువేసుకుని...