
ఆదివారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 2025
రెండెకరాలకు పది ఎకరాలుందని చూపి..
రెండు ఎకరాలున్న ఓ రైతుకు ఆన్లైన్లో పది ఎకరాలు ఉందని తప్పుగా చూపి వారి పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని ఎగ్గొట్టారు. కొండపి మండలం కే ఉప్పలపాడు గ్రామానికి చెందిన కొల్లి వీరనారాయణమ్మ, రామకృష్ణారెడ్డి దంపతులకు కుమార్తె గీతికరెడ్డి, కుమారుడు వెంకట దీపక్ రామిరెడ్డి ఉన్నారు. గీతిక రెడ్డి స్థానిక జెడ్పీ హైస్కూల్లో 9వ తరగతి, వెంకట దీపక్ రామిరెడ్డి పాపారావు హైస్కూల్లో ఆరో తరగతి చదువుతున్నాడు. సామాన్య మధ్యతరగతి కుటుంబం కావడంతో కుటుంబ పోషణ అంతంత మాత్రమే ఉండడంతో కూలీ నాలి చేసుకుంటూ పిల్లల్ని చదివిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి పథకం ద్వారా కుమార్తె గీతికా రెడ్డికి అమ్మ ఒడి నిధులు జమయ్యాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక మెట్ట భూమి 10 ఎకరాలు అంతకంటే ఎక్కువ ఉందంటూ అనర్హుల జాబితాలో చేర్చారు. అయితే వారికి తల్లిదండ్రులు ఇచ్చిన రెండు ఎకరాల పొలం తప్పితే ఎటువంటి భూమి లేదు. ఆన్లైన్లో తప్పుగా వచ్చిందని..అర్హులైన తమకు పథకం అందేలా చూడాలని వారు కోరుతున్నారు.