సాక్షి, వైఎస్సార్ జిల్లా: తప్పుడు వాగ్దానాలతో రాష్ట్ర ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని కూలదోసే దాకా తగ్గేదే లేదంటున్నారు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు. తనపై బనాయించిన అక్రమ కేసుల విచారణలో భాగంగా గురువారం ఆయన జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన చేసిన పని వైస్సార్సీపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపింది.
తొలుత గండి వీరాంజనేయ దేవస్థానానికి వెళ్లిన అంబటి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇడుపులపాయలోని వైఎస్సార్ఘాట్ను సందర్శించి మహానేత రాజశేఖర్రెడ్డికి పూలమాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా.. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలోనే కూలుస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు.
వైఎస్ జగన్ను మళ్లీ అధికారంలోకి తెచ్చే వరకూ అలుపెరగని పోరాటం చేస్తామని.. ఈ పోరాటంలో ఎన్ని కుట్రలు, దాడులు, కేసులు, జైళ్లు ఎదురైనా ధైర్యంగా పోరాడతామని.. వైఎస్సార్ సాక్షిగా ఇదే నా ప్రతిజ్ఞ అని అన్నారాయన.

ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అంబటి రాంబాబుపై అక్రమ కేసు బనాయించింది కూటమి ప్రభుత్వం. ఈ వ్యవహారంలో అంబటి తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకుని క్షమాపణలు కూడా చెప్పారు. అయినా కూడా వినకుండా టీడీపీ గూండాలు ఆయన ఇల్లు, ఆఫీస్పై దాడి చేసి విధ్వంసం సృష్టించాయి. ఈ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయకపోగా.. టీడీపీ నేతల ఫిర్యాదు నేపథ్యంతో అంబటిపైనే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
రెండువారాల పాటు రాజమండ్రి జైల్లో ఉన్న ఆయన బెయిల్పై విడుదలయ్యారు. అప్పటి నుంచి దాడి చేసిన వాళ్లపై, కస్టడీలో తనను టార్చర్ చేసిన పోలీసు అధికారులపై చర్యలు కోరుతూ ధర్మ పోరాటం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కేసుల విచారణలో భాగంగా.. వేంపల్లి, పులివెందుల పోలీస్ స్టేషన్లలో ఇవాళ విచారణకు అంబటి హాజరవుతున్నారు.


