సాక్షి, తాడేపల్లి: తప్పు చేశారు అని క్లియర్ కట్గా ఉన్నా.. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు కూటమి ప్రభుత్వం ఒప్పుకోవడం లేదని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లిలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన డీఎస్సీ అవకతవకల అంశంపై మీడియా సమావేశంలో మాట్లాడారు.
డీఎస్సీ అక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ ఆధారాలు ప్రజల ముందు ఉంచాం. ఆ అవకతకవలపై సీబీఐ విచారణ జరిపించాల్సిందే. చట్టసభల్లో ప్రధాన ప్రతిపక్షానికి సమయం ఇవ్వాల్సి వస్తుందని తమకు ఆ హోదా ఇవ్వడం లేదు. కౌన్సిల్లోనూ మాట్లాడడానికీ సమయం ఇవ్వడం లేదు. బౌలింగ్, ఫీల్డింగ్ లేకుండా తండ్రీకొడుకులు బ్యాటింగ్ చేస్తున్నారు అని చంద్రబాబు, నారా లోకేశ్లను ఉద్దేశించి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.
డీఎస్సీలో అక్రమాలపై పోరాడుతున్నాం. అందుకే తమ హయాంలో నిర్వహించిన ఏపీపీఎస్సీ గ్రూప్-1పై కూటమి ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేసింది. ప్రశ్నిస్తే గింజుకుంటున్నారు తప్ప.. తప్పు ఒప్పుకోవడం లేదు. అసెంబ్లీలో మాట్లాడతారు కానీ.. మండలిలో మాట్లాడరు. తప్పులను ప్రతిపక్షం ఎత్తి చూపుతుందని చంద్రబాబుకు భయం అని వైఎస్ జగన్ అన్నారు.
డీఎస్సీ పేపర్ తయారీ, నిర్వహణ ఒకే అధికారి చేతిలో పెట్టారు. స్వయంగా ఈ విషయాన్ని లోకేశ్ సభలో అంగీకరించారు. ప్రశ్నాపత్రం తయారీ బాధ్యత ఎస్సీఈఆర్టీది. పరీక్ష నిర్వహణ డీఎస్సీ కన్వీనర్ది. రెండూ ఒకే వ్యక్తి చేతిలో పెడితే పారదర్శకత ఉంటుంందా?. ఏపీ డీఎస్సీ నియామక చరిత్రలోనే రెండు బాధ్యతలు ఒకే అధికారి చేతికి ఎప్పుడూ ఇవ్వలేదు. ఇక్కడే డీఎస్సీ స్కామ్కు బీజం పడింది. అందుకే సీబీఐ విచారణ అడుగుతున్నాం. ఒకే వ్యక్తి చేతిలో రెండు బాధ్యతలు ఎందుకు పెట్టారు?. ఇలా చేయడం లీకేజీకి తెర తీసినట్లు కాదా? అని వైఎస్ జగన్ నిలదీశారు.
ఆ లీకులు నవీన్ ఒక్కడి దగ్గరే ఆగాయా?
నవీన్ తన ర్యాంకును, ఉద్యోగానికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ విద్యాశాఖకు లేఖ కూడా రాశారని జగన్ తెలిపారు. మొదటి మెరిట్ జాబితాలో నవీన్కు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని, ఈ విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం కూడా అంగీకరించిందని చెప్పారు. అలాంటప్పుడు ఫస్ట్ ర్యాంకర్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
వెరిఫికేషన్కు హాజరు కాలేదనే కారణంతో నవీన్కు ఉద్యోగం ఇవ్వలేదని ప్రభుత్వం చెబుతోందని వైఎస్ జగన్ అన్నారు. అదే నిజమైతే.. తనకు ఉద్యోగం ఇవ్వలేదంటూ నవీన్ కోర్టును ఎందుకు ఆశ్రయించాడని ప్రశ్నించారు. అంతేకాకుండా రెండో మెరిట్ జాబితాలో నవీన్ పేరు లేకుండా ఎలా విడుదల చేశారని నిలదీశారు.
పేపర్ లీకేజీ వ్యవహారాన్ని కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు, లోకేశ్ అబద్ధాలు చెబుతున్నారని వైఎస్ జగన్ అన్నారు. ముందుగానే నవీన్ పేరును మెరిట్ జాబితా నుంచి తొలగించారని అన్నారు. ప్రశ్నాపత్రం తయారీ విభాగంలో పనిచేసే ఉద్యోగికి ఫస్ట్ ర్యాంక్ రావడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. నవీన్ ఒక్కడి వరకే పేపర్ లీక్ పరిమితమైందా? లేక ఇంకా ఎంతమందికి చేరింది? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. నవీన్ విషయంలోనే ఇలా జరిగిందా? డీఎస్సీ వ్యవహారంలో మరెవరైనా లబ్ధి పొందారా? అనే అంశాలపైనా సమగ్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని.. అందుకే సీబీఐ దర్యాప్తు కోరుతున్నామని చెప్పారు.



