‘నాపై పోక్సో కేసు కొట్టేయండి’.. హైకోర్టుకు మాజీ సీఎం యడ్యూరప్ప | Yediyurappa Requests High Court To Cancel POCSO Case Against Him | Sakshi
Sakshi News home page

‘నాపై పోక్సో కేసు కొట్టేయండి’.. హైకోర్టుకు మాజీ సీఎం యడ్యూరప్ప

Jun 28 2024 5:35 PM | Updated on Jun 28 2024 6:07 PM

Yediyurappa Requests High Court To Cancel POCSO Case Against Him

సాక్షి,బెంగళూరు : లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక బీజేపీ నేత, మాజీ సీఎం యడ్యూరప్పకు ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. మైనర్‌ బాలిక లైంగిక వేధింపుల కేసులో తనపై పోక్స్‌ చట్టం కింద కేసు నమోదైందని, ఆ కేసును కొట్టి వేయాలని కోరుతూ యడ్యూరప్ప కర్ణాటక హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే..ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ కేసు విషయంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ ఓ మహిళ, ఆమె కుమార్తె ఇద్దరూ డాలర్స్‌ కాలనీలో ఉన్న యడ్యూరప్ప నివాసానికి వెళ్లారు. అక్కడ తన కుమార్తెను యడ్యూరప్ప లైంగికంగా వేధించారని సంచలన ఆరోపణలు చేస్తూ ఓ మహిళ మార్చి నెలలో సదాశివ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. గంటల వ్యవధిలో కర్ణాటక డీజీపీ అలోక్‌ మోహన్‌ ఆ కేసును విచారణ నిమిత్తం సీఐడికి బదిలీ చేశారు.

జూన్‌ 17న సీఐడీ అధికారులు యడ్యూరప్పను మూడు గంటల పాటు విచారించారు. పోక్స్‌ కేసు నమోదు చేశారు. ఆ కేసుపై మాజీ సీఎం స్పందిస్తూ ‘నాపై కుట్రలకు పాల్పడే వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని’ ఆయన అన్నారు.

తాజాగా,ఈ కేసు దర్యాప్తు వేగవంతంగా జరగడం లేదని బాధితురాలి కుటుంబసభ్యులు కర్ణాటక హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో యడ్యూరప్ప కోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.ఆ రెండు పిటిషన్లపై ఇవాళ కోర్టులో విచారణకు రానున్నాయి.

అనూహ్యంగా గురువారం సాయంత్రం సీఐడీ యడ్యురప్పపై 750 పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఈ వరుస పరిణామాల నేపథ్యంలో తనపై నమోదు చేసిన పోక్స్‌ కేసును కొట్టి వేయాలని కర్ణాటక హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడంతో కేసుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 

Advertisement
 
Advertisement
Advertisement