సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టనున్న ‘నవనిర్మాణ సంకల్ప సభ’ రాజకీయ దుమారానికి దారితీసింది. తెలంగాణ ఉద్యమం నుంచి రాష్ట్ర ఆవిర్భావం వరకు, ఆ తర్వాత కూడా తెలంగాణపై పవన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాజకీయ, ప్రజా సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పవన్పై విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించిన వ్యక్తికి ఇక్కడ నవనిర్మాణం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని, ముందుగా తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతే సభ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
సోమవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం మాట్లాడుతూ.. తెలంగాణ వారి కనులు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతాయని మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని తెలంగాణలో సభలు పెడుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 11 రోజులు అన్నం మానేశానని చెప్పిన వ్యక్తి, అదే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఇక్కడికి వచ్చి మొసలి కన్నీరు కారిస్తే ప్రజలు నమ్మరన్నారు.
తెలంగాణ ఏర్పడినప్పుడు వ్యతిరేకించిన వ్యక్తి ఇప్పుడు తెలంగాణపై ప్రేమ చూపించడం రాజకీయ నాటకమేనని విమర్శించారు. ‘‘కన్న తల్లికి గాజులు కొనలేని వాడు పినతల్లికి ఒడ్డాణం చేస్తాడనే సామెత ఉంది. ఆంధ్రప్రదేశ్లో చేయలేనిది తెలంగాణలో వచ్చి చేస్తాననడం విడ్డూరం’’ అని వ్యాఖ్యానించారు.
పవన్ కళ్యాణ్ నవనిర్మాణ సభల వెనుక బీజేపీ రాజకీయ ఎజెండా ఉందని ఆరోపించిన పొన్నం.. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం, కేరళ, తమిళనాడుల్లో కాకుండా తెలంగాణనే ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టడం, సామాజిక వైషమ్యాలు సృష్టించడం లక్ష్యంగా బీజేపీ డైరెక్షన్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే అనుమానం ప్రజల్లో ఉందన్నారు.
‘‘సినిమాల్లో హీరోగా అభిమానించొచ్చు. కానీ రాజకీయాల్లో తెలంగాణ వ్యతిరేక ధోరణితో వస్తే నిలదీస్తాం. పవన్ కళ్యాణ్ సినిమా నటుడు. పైసలు ఇస్తే ఏ పాత్రనైనా పోషిస్తాడు. ఇప్పుడు బీజేపీ స్క్రిప్ట్కు తగ్గట్టే నటిస్తున్నాడు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ కోసం పార్లమెంట్లో, ఉద్యమాల్లో, సకల జనుల సమ్మెలో వేలాది మంది పోరాడారని గుర్తుచేసిన మంత్రి పొన్నం.. అమరవీరుల త్యాగాలతో ఏర్పడిన రాష్ట్ర ఆత్మగౌరవాన్ని ఎవరైనా కించపరిస్తే సహించబోమన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ప్రతి తెలంగాణ బిడ్డకు పండుగరోజు అని, ఆ వేడుకల్లో పాల్గొనాలనుకుంటే ఎవరైనా రావొచ్చని, కానీ తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించే వ్యక్తి ఇక్కడ రాజకీయ సభలు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్తో తమకు సోదర సంబంధాలే ఉన్నాయని, అక్కడి ప్రజలపై ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్పారు. అయితే తెలంగాణపై విషం కక్కిన వ్యక్తి ఇక్కడికి వచ్చి ప్రేమ నటిస్తే ప్రజలు నమ్మరన్నారు. ‘‘బీజేపీ ఇచ్చే రెమ్యూనరేషన్ కోసం తెలంగాణకు రావడం లేదని నువ్వు నమ్మిన దేవుడు కొండగట్టు అంజన్నపై ప్రమాణం చేసి చెప్పగలవా పవన్ కళ్యాణ్?’’ అంటూ సవాల్ విసిరారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, గంగవరం, కృష్ణపట్నం పోర్టుల అంశం, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి ప్రజా సమస్యలపై స్పందించకుండా తెలంగాణకు వచ్చి రాజకీయాలు చేయడం ఎందుకని ప్రశ్నించారు. ‘‘సినిమాల్లో దేశభక్తి చూపించడం కాదు.. నిజ జీవితంలో ప్రజల కోసం నిలబడాలి. ఏపీ ప్రజలు నీకు అధికారం ఇచ్చారు. ముందు అక్కడ నవనిర్మాణం చేసి చూపించు’’ అని హితవు పలికారు.
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గాయపరిచేలా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ముందుగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో తెలంగాణ సమాజం ఆయన రాజకీయ ఉద్దేశాలను అంగీకరించదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు


