కావలిలో అడుగు పెట్టి తీరతాం.. బుడ్డ బెదిరింపులకు భయపడం: కాకాణి | TDP MLA Kavya Krishna Reddy Provocation Kakani Govardhan Reddy House Arrest More Details Inside | Sakshi
Sakshi News home page

కావలిలో అడుగు పెట్టి తీరతాం.. బుడ్డ బెదిరింపులకు భయపడం: కాకాణి

Aug 29 2025 9:44 AM | Updated on Aug 29 2025 10:56 AM

TDP MLA Kavya Krishna Reddy Provocation Kakani House Arrest Details

సాక్షి, నెల్లూరు: మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి సంఘీభావంగా వైఎస్సార్‌సీపీ నేతలు చేపట్టిన నిరసనకు పోలీసులు అడ్డు తగిలారు. మాజీ మంత్రి కాకాణి గోవర్దనరెడ్డిని, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి సహా పలువురు నేతలను కావలికి వెళ్లకుండా అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ పరిణామాలపై ఈ ఇద్దరూ తీవ్రంగా స్పందించారు. 

రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ప్రతాప్ కుమార్ రెడ్డి పై అక్రమ కేసు నమోదు చేశారు. ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పడానికి కావలి బయల్దేరాం. కానీ, కావలిలో ఎలా అడుగు పెడతారో చూస్తాం.. తలలు తీస్తాం అంటూ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేడు పోలీసులను అడ్డం పెట్టుకొని హౌస్ అరెస్ట్ చేయించారు. కానీ, టీడీపీ బుడ్డ బెదిరింపులకి భయపడేది లేదు. అక్రమాలపై పోరాడతాం. 

పోలీసులు రాష్ట్రంలో శాంతిభద్రతను గాలికి వదిలేశారు. వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు, అరెస్ట్‌ ప్రధాన ఎజెండాగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు. ఇవాళ కాకపోయినా రేపోమాపో కావలిలో అడుగుపెట్టి తీరతాం. కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అరాచకాలు అక్రమాలను బయటపెడతాం అని కాకాణి అన్నారు.

హౌజ్‌ అరెస్ట్‌లో ఉన్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లాలో ప్రజాస్వామ్యం చనిపోయింది. మాపైనే దాడి చేసి.. తిరిగి మాపైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారు. మాజీ మంత్రి కాకాణి అక్రమ అరెస్టుతో ఈ పరంపర మొదలైంది. ఇప్పుడు ప్రతాప్ కుమార్ రెడ్డి పై అక్రమ కేసు బనాయించారు. ఆ కుటుంబాన్ని కలవడానికి వెళ్తే.. మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు. కావలి టోల్ ప్లాజా దాటితే తలలు నరుకుతామని టీడీపీ  బెదిరిస్తోంది. ఇప్పుడు పోలీస్ శాఖ అడ్డం పెట్టుకొని హౌస్ అరెస్ట్ చేయిస్తోంది అని మండిపడ్డారు.

మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిపై అక్రమ కేసును నిరసిస్తూ కాకాణి, చంద్రశేఖర్ కావలికి పయనం అయ్యారు. అయితే.. కావలిలో ఎలా అడుగు పెడతారో చూస్తాను అంటూ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి బెదిరింపులకు దిగిన సంగతి తెలిసే ఉంటుంది. ఈ క్రమంలో పోలీసులను అడ్డుపెట్టుకుని వైఎస్సార్‌సీపీ నేతలపై కక్షసాధింపునకు దిగారు. ఎమ్మెల్యే ఆదేశాలనుసారం వేదాయపాళెం పోలీసులు నోటీసులు జారీ చేయడానికి వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement