
అసంతృప్తి వ్యక్తం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ
సాక్షి, తిరుపతి: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీలో పదవుల పందేరంపై తముళ్లు భగ్గుమంటున్నారు. ప్రజల్లో లేనివారికి పదవులు కట్టబెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసమర్థులను అందలమెక్కిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. (చదవండి: ప్రాధేయపడినా కనికరించలేదు..)
నిలదీత..
టీడీపీ రాష్ట్ర కమిటీలో తిరుపతికి చెందిన కొంతమందికి పదవులు దక్కాయి. దీనిపై స్థానిక నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ మోసాలకు పాల్పడిన వారు, ప్రజల్లోకి రాని వారికి చోటు కల్పించడం సిగ్గుచేటని బహిరంగంగా విమర్శించారు. ఈ మేరకు ఆ పార్టీ నాయకులు ఆర్సీ మునికృష్ణ, బుల్లెట్ రమణ, వియలక్ష్మి శుక్రవారం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను నిలదీశారు. ఏ రోజూ ప్రజల్లోకి రాని వ్యక్తులకు పదవులు ఇవ్వడం ఏంటన్నారు. కార్యకర్తలకు ఏం సందేశం ఇస్తున్నారంటూ విజయలక్ష్మి, ఆర్సీ మునికృష్ణ మండిపడ్డారు. సుగుణమ్మ స్పందిస్తూ తాను సిఫార్సు చేసిన వారికి పదవులు ఇవ్వలేదన్నారు. నియోజకవర్గ ఇన్చార్జి పదవి కూడా ఎవరికో ఒకరికి ఇచ్చేయండి అంటూ ఆమె అసహనం వెళ్లగక్కారు. చంద్రబాబుకు సన్నిహితుడైన జయరామిరెడ్డి భార్య రజనీ, వినుకొండ సుబ్రమణ్యం, సిపాయి సుబ్రమణ్యం, సూరా సుధాకర్రెడ్డికి పదవులు కట్టబెట్టడంపై ఆమె అసంతృప్తిని వ్యక్తం చేశారు. (చదవండి: టీడీపీ సూపర్ జంబో రాష్ట్ర కమిటీ)